Rashmika Mandana : నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా సౌత్ లోనే కాదు నార్త్ లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పుష్ప మూవీతో అది అమాంతం పెరిగిపోయింది అనే చెప్పాలి. ఆ మూవీలోని ‘తగ్గేదేలే’ మేనరిజం ఎంత ఫేమస్ అయ్యిందో రష్మిక చేసిన ‘నా సామీ’ డాన్స్ నెంబర్ కూడా అంతటి క్రేజ్ తెచ్చుకుంది. అయితే రష్మిక అంతకు ముందే యువన్ శంకర్ రాజా మరియు ఒక బాలీవుడ్ రాప్ సింగర్ తో కలిసి ఒక రాప్ సాంగ్లో నటించి హిందీ ఆడియన్స్ కి పరిచయమైంది.
ఇక పుష్ప సినిమా తెచ్చిన హిట్తో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బీటౌన్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఇంతటి జోష్ లో ఉన్న రష్మికకు బాలీవుడ్ లో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేయకముందే ఆమె నటించిన ఒక సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
టైగర్ ష్రాఫ్తో రష్మిక జంటగా నటిస్తున్న ‘స్క్రూ ఢీలా’ అనే చిత్రం ఆగిపోయింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఈ చిత్రం కోసం కరణ్ టైగర్కు రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ మేరకు అగ్రిమెంట్ చేసాడట. అయితే ఇప్పుడు టైగర్ను రెమ్యునరేషన్ తగ్గించుకోమని కరణ్ కోరాడని సమాచారం.
బాలీవుడ్ లో బాయ్కాట్ ట్రెండ్ నడుస్తుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో నిర్మాత కరణ్ టైగర్ ని పారితోషికం కింద రూ.20కోట్లు తీసుకుని, లాభాల్లో వాటా తీసుకోవాలంటూ కోరాడట. అందుకు గాను టైగర్ ససేమీరా అనడంతో సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు బాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. అయితే దీనిలో ఎంత నిజం ఉన్నది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. దీంతో టైగర్ చేసిన పనికి రష్మికకు కూడా మంచి ఛాన్స్ మిస్ అయింది అంటూ ఆమె అభిమానులు టైగర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.