Yellow Crazy Ants: తమిళనాడులో ప్రజలను హడలెత్తిస్తోన్న చీమలు.. ఊళ్లను ఖాళీ చేస్తున్న జనం.. ఎందుకిలా అంటే?

తమిళనాడు రాష్ట్రంలోని దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో ఏడు గ్రామాలపై ఎల్లో క్రేజీ యాంట్స్ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ చీమలు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి. ఇవి పాకిన చోట దద్దుర్లు, పొక్కులు వస్తుండటంతో ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

Yellow Crazy Ants: తమిళనాడులోని అటవీ ప్రాంతాల్లో పలు గ్రామాల్లో చీమలు గుంపులుగా వచ్చి దండయాత్ర చేస్తున్నాయి. రాష్ట్రంలోని కరంతమలై రిజర్వ్ ఫారెస్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ‘ఎల్లో క్రేజీ యాంట్స్’ అనే చీమలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సన్నగా, చిన్నగా ఉండే ఈ చీమలు చాలా చురుగ్గా కదులుతాయి. ఈ చీమల దాటికి తట్టుకోలేక ప్రజలు గ్రామాలను ఖాళీచేసి వెళ్లిపోతున్నారు. ఇవి చిన్నచిన్న కీటకాలను, పురుగులను చంపేస్తుంటాయి. స్థానిక జాతుల కీటకాలు, చీమల పుట్టల్ని ఆక్రమించి వాటిని నాశనం చేస్తుంటాయి. ఒకటని కాదు ఏది దొరికితే దానిని తినేస్తాయి.

Yellow crazy ants

తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా కరంతమలై రిర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో ఏడు గ్రామాలపై ఈ ఎల్లో క్రేజీ యాంట్స్ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా మంది వ్యవసాయం, పశువుల పెంపకంను జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్నారు. అయితే ఈ చీమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అడవి దగ్గరికి వెళ్లగానే చీమలు మనపైకి ఎక్కిచికాకు చేస్తాయని, వీటి కారణంగా పొక్కులు వస్తున్నాయని స్థానికులు తెలిపారు.

Yellow crazy ants

అవి ఒక్కసారిగా గుంపులుగా వస్తుండటంతో తాగేందుకు నీళ్లు కూడా తీసుకెళ్లలేక పోతున్నామని, ఏం చేయాలో తోచడం లేదని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా అడవిలో ఈ చీమలు చూస్తున్నామని, అయితే జనజీవనాన్ని అస్తవ్యస్తంచేస్తూ గ్రామాల్లో ఇంత పెద్ద సంఖ్యలో కనిపించడం ఇదే తొలిసారని స్థానికులు పేర్కొంటున్నారు. కొందరు గ్రామస్తులు చీమల గుంపు దాడిని తట్టుకోలేక గ్రామాల్లోని ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

Yello crazy ants

మరోవైపు చీమలు దాడి చేయడం వల్ల పశువులతో పాటు పాములు, కుందేళ్లు కూడా చనిపోతున్నాయి. అయితే ఈ చీమలు కుట్టవు, కరవవు. అవి విడుదలచేసే ఫార్మిక్ యాసిడ్ జంతువుల కళ్లను ప్రభావితం చేసి ఉండవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఫార్మిక్ యాసిడ్ పడినచోట దురద, చర్మం పొట్టులా రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ విషయంపై కీటక శాస్త్రవేత్తలు, అటవీశాఖ అధికారులు దృష్టిసారించారు, నమూనాల్ని సేకరించి పరిశోధనకు పంపడంతో పాటు వాటి నైజాన్ని పరిశీలిస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియాలోని క్రిస్‌మస్ ఐలాండ్ లో లక్షలాది ఎర్ర చీమలు ఎర్ర పీతలను చంపి తినేశాయి. వాటి నివారణకు హెలికాప్టర్ల ద్వారా ముందులను పిచికారి చేశారు. దీంతో 95శాతం ఫలితాలొచ్చాయని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు