team india
IND vs WI : ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో 1-2తో వెనుకబడిన భారత్ సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి 9 వికెట్ల తేడాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ను చిత్తు చేసింది. 179 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా వికెట్ మాత్రమే నష్టపోయి 17 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (84 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 3సిక్సర్లు), శుభ్మన్ గిల్(77; 47 బంతుల్లో 3ఫోర్లు, 5 సిక్సర్లు) లు అర్థశతకాలతో రాణించారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తన అరంగ్రేటం మ్యాచ్లో ఒక్క పరుగుకే వెనుదిరిగిన యశస్వి జైశ్వాల్ ఈ మ్యాచ్లో మాత్రం అదరగొట్టాడు. మెకాయ్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పాడు. ఎట్టకేలకు ఫామ్ అందుకున్న మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా ధాటిగా ఆడడంతో పవర్ ప్లే(6 ఓవర్లు) ముగిసే సరికి భారత్ 66/0తో నిలిచింది.
ODI World Cup 2023 : కేఎల్ రాహుల్ వస్తే.. సంజు శాంసన్ బలి..!
వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ బౌలర్లను మార్చినప్పటికీ ఓపెనింగ్ జోడి ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కని షాట్లతో అలరించింది. వీరిద్దరు దూకుడుగా ఆడడంతో 10 ఓవర్లకు స్కోరు సరిగ్గా 100 పరుగులకు చేరింది. 11 ఓవర్ను పావెల్ వేయగా రెండో బంతికి రెండు పరుగులు తీసి 30 బంతుల్లో గిల్, నాలుగో బంతిని బౌండరీకి తరలించి యశస్వి జైస్వాల్ను హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇది జైస్వాల్కు తొలి అర్థశతకం.
ఆ తరువాత కూడా వీరిద్దరు అదే దూకుడును కొనసాగిస్తూ లక్ష్యాన్ని వేగంగా కరిగించసాగారు. 16వ ఓవర్లో షెపర్డ్ బౌలింగ్లో తొలి బంతికి సిక్స్ బాదిన శుభ్మన్ గిల్ అదే ఊపులో మూడో బంతికి మరో భారీ షాట్కు యత్నించి బౌండరీ లైన్ వద్ద షై హోప్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. యశస్వి-శుభ్మన్ జోడి తొలి వికెట్కు 165 పరుగులు జోడించారు. అప్పటికీ
భారత విజయానికి 27 బంతుల్లో 14 పరుగులు మాత్రమే అవసరం కాగా.. తిలక్ వర్మ(7 నాటౌట్)తో కలిసి యశస్వి జైస్వాల్ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశాడు.
Ambati Rayudu : మళ్లీ క్రికెట్ ఆడనున్న రాయుడు.. అయితే మనదగ్గర ఆడడట.. ఇంకెక్కడంటే..?
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో షిమ్రాన్ హెట్మెయర్ (61; 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా షై హోప్ (45; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. కైల్ మేయర్స్(17), బ్రాండన్ కింగ్(18) ఫర్వాలేనిపించగా కెప్టెన్ పావెల్(1), నికోలస్ పూరన్ (1), జేసన్ హోల్డర్ (3) విపలం కావడంతో విండీస్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ రెండు, అక్షర్ పటేల్, చాహల్, ముకేశ్ కుమార్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Dinesh karthik : జైలర్ పై దినేశ్ కార్తీక్.. సూపర్స్టార్ ఈజ్ ది బెస్ట్ అంటూనే..
ఇక ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో ప్రస్తుతానికి సిరీస్ 2-2తో సమమైంది. నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ రేపు(ఆగస్టు 13 ఆదివారం)ఇదే మైదానంలో జరగనుంది.