Electricity Bill Scam : మీరు సకాలంలో విద్యుత్ బిల్లును చెల్లించలేదా? బకాయిలు చెల్లించకపోతే.. మీ విద్యుత్ కనెక్షన్ కట్ చేయడం జరుగుతుంది.. మీకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త.. విజయవాడ సహా దక్షిణాది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో బిల్లులు చెల్లించకుంటే.. విద్యుత్ను నిలిపివేస్తామని బెదిరింపు మెసేజ్లు వచ్చేవి. దురదృష్టవశాత్తు.. చాలా మంది బాధితులు ఈ స్కామర్ల వలలో పడ్డారు. తమ డబ్బును పోగొట్టుకున్నారు.
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కె.పెద్ద రామకృష్ణం రాజు అనే వ్యక్తి ఇదే తరహా మోసానికి రూ.1.85 లక్షల నష్టపోయాడు. నివేదిక ప్రకారం.. పెదపుల్లేరు గ్రామానికి చెందిన రామకృష్ణం రాజు అనే వ్యక్తికి తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. మార్చిలో ఫిబ్రవరి విద్యుత్ బిల్లు చెల్లించాలని మెసేజ్లో పేర్కొన్నారు. విద్యుత్ శాఖ నుంచి వచ్చిన అధికారిక మెసేజ్ అనుకుని నమ్మి ఫోన్కు స్కామర్లు పంపిన లింక్పై క్లిక్ చేశాడు.
Read Also : Realme 11 Launch Date : రూ. 20వేల ధరలో రియల్మి 11x సిరీస్ ఫోన్లు.. లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసిందోచ్..!
ఈ లింక్ అతన్ని వెబ్సైట్కి రీడైరెక్ట్ అయింది. ఆ తర్వాత పేమెంట్ చేశాడు. అయితే, లావాదేవీకి సంబంధించిన రసీదు అతనికి అందలేదు. రశీదు లేకపోవడంతో కంగారుపడి మెసేజ్లోని నంబర్కు ఫోన్ చేశాడు. బిల్లు రసీదు పొందేందుకు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని స్కామర్లు అతనికి సూచించారు. అది నమ్మి, వారి సూచనలను అనుసరించి, స్కామ్లో చిక్కుకున్నాడు.
యాప్ రసీదు ఇవ్వడానికి బదులుగా, అతని బ్యాంకు వివరాలను దొంగిలించి, అతని అకౌంట్ నుంచి రూ.1.85 లక్షలు స్వాహా చేశారు. బ్యాంకును విజిట్ చేసిన తర్వాత డబ్బులు దొంగిలించిన విషయాన్ని గుర్తించాడు. ఈ మోసపూరిత స్కామ్ అనేక మంది వ్యక్తులను ప్రభావితం చేసింది. గత 6 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ఇలాంటి కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.
మరిన్ని సంఘటనలు జరగకుండా విజయవాడ పోలీసులు తమను తాము ఎలా రక్షించుకోవాలో పౌరులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించడానికి ఉద్దేశించిన హానికరమైన యాప్లకు తరచుగా లింక్లను పంపుతున్నారు. ఇలాంటి మెసేజ్లను స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సలహా ఇస్తున్నారు.
ఇలాంటి సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడానికి, భద్రతను నిర్ధారించడానికి, పోలీసులు ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. మీరు బకాయి ఉన్న విద్యుత్ బిల్లును చెల్లించాలని కోరుతూ మెసేజ్ అందుకుంటే, జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును దొంగిలించడానికి పన్నాగం కావచ్చు. ఏదైనా లింక్లపై క్లిక్ చేయడానికి లేదా మీ బ్యాంక్ వివరాలను అందించే ముందు ఎల్లప్పుడూ రెండుసార్లు చెక్ చేసుకోండి.