Karimnagar Robbery : దొంగలు రెచ్చిపోతున్నారు. యథేచ్చగా దోపిడీలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా దొంగతనాలకు అడ్డుకట్ట పడటం లేదు. రాత్రిళ్లే కాదు పట్టపగలు కూడా దొంగలు బరితెగిస్తున్నారు. కరీంనగర్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే భారీ చోరీకి పాల్పడ్డారు. పక్కాగా రెక్కీ నిర్వహించిన దొంగలు.. వెంటాడి మరీ రూ.15 లక్షలు దోచుకెళ్లారు.
ఓ వ్యక్తి కలెక్టరేట్ ఎస్బీఐ బ్యాంకు నుంచి రూ.15లక్షలు డ్రా చేశాడు. ఇది గమనించిన దొంగలు ఆ వ్యక్తిని వెంబడించారు. కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో నగదు చోరీ చేశారు. దొంగతనంపై బాధితుడు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా, దొంగలు పక్కాగా రెక్కీ నిర్వహించి, వెంటాడి మరీ రూ.15లక్షలు దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ చోరీ స్థానికులను భయాందోళనకు గురి చేసింది.