చంద్రబాబు మీద, ఓ కులం మీద కోపంతో జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, మంగళగిరి
చంద్రబాబు మీద, ఓ కులం మీద కోపంతో జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. పవన్ ఆరోపణలను ఆర్కే ఖండించారు. పవన్ పై ఎదురుదాడి చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కే క్లారిటీ ఇచ్చారు. అసలు పవన్ రాజధాని ప్రాంతానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎలాంటి లబ్ది కోసం వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ నిజమైన రాజధాని ప్రాంత రైతులను కలవలేదని ఆర్కే అన్నారు. పవన్ పర్యటనలో టీడీపీ నేతలు ఆయన వెంట నడిచారని ఆరోపించారు. రాజధాని రైతులకు చంద్రబాబు చేసిన అన్యాయం పవన్ కు తెలియదా అని నిలదీశారు. గతంలో పవన్ ఏం మాట్లాడారో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం స్పష్టంగా ఉందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. విపక్షాలే రాద్దాంతం చేసి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని మండిపడ్డారు. రాజధాని మార్పుపై సీఎం జగన్ ప్రకటన చేయాల్సిన అవసరం లేదన్నారాయన. రాజధానిపై పవన్ ఎన్ని స్టాండ్లు తీసుకుంటారని ఎమ్మెల్యే ఆర్కే నిలదీశారు. రాజధాని పేరుతో టీడీపీ భారీ అవినీతి చేసిందని ఆరోపించారు. టీడీపీని పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. పవన్ ఇంకా టీడీపీ పార్టనర్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజధాని పేరుతో పాల్పడిన అవినీతి బయటికి వస్తుందనే చంద్రబాబు ఆందోళన పడుతున్నారని ఆర్కే అన్నారు.