Kcr On Ec Ban : ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్.. హాట్ కామెంట్స్

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటుంది.

Kcr On Ec Ban : తన ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన నిషేధంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. నాపై ఎలక్షన్ కమిషన్ నిషేధ ఆంక్షలు విధించిందన్న కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా పేగులు మెడలో వేసుకుంటా అన్నాడు. మరి ఆయనపై ఎలాంటి నిషేధం విధించలేదు అని వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ లో రోడ్ షో లో కేసీఆర్ మాట్లాడారు.

”ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాపై నిషేధం విధించింది. 48 గంటలు ప్రచారం చేయొద్దరి, ప్రచారంలో పాల్గొనవద్దని నామీద బ్యాన్ విధించింది. మీ అందరిని నేను ఒక్కటే కోరుతున్నా. ఇదే రేవంత్ రెడ్డి.. నీ పేగులు మెడలో వేసుకుంటా, నీ గుడ్లు పీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే.. ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు. కానీ, నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెబుతున్నా.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, బీఆర్ఎస్ బిడ్డలంతా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని నేను మనవి చేస్తున్నా” అని కేసీఆర్ అన్నారు.

”రాష్ట్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తా అంటుంది. ఈ జిల్లా ఉండాలంటే ఈ ముఖ్యమంత్రి మెడలు వంచాలి. ఇక్కడ మాలోతు కవిత గెలవాలి. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటోంది. ఉచిత బస్సు వల్ల ఆటోవాలాల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలి.

మోడీ మన గోదావరిని ఎత్తుకపోతా అంటుంటే ముఖ్యమంత్రి ముడుసుకొని కూర్చున్నారు. ఎనిమిదేళ్లు నడిచిన కరెంట్, నీళ్ళు ఎక్కడ పోయాయి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించండి. నా ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వను. ఎన్నికల కమిషన్ నిషేధం వల్ల ఎక్కువగా మాట్లాడలేక పోతున్నా” అని కేసీఆర్ అన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులతో రోడ్ షో సమయాన్ని కుదించుకున్నారు కేసీఆర్. మహబూబాబాద్ జిల్లా కేంద్రం రోడ్ షోలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన రాత్రి 8 గంటల లోపు ప్రసంగాన్ని పూర్తి చేశారు. కాగా, కేసీఆర్ రోడ్ షోకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. సభలో కేసీఆర్ తక్కువ సమయం మాట్లాడడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశకు గురయ్యాయి.

కాగా.. కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది ఈసీ. ఈరోజు(మే 1) రాత్రి 8 గంటల నుంచి 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు ప్రచారం నిర్వహించవద్దని కేసీఆర్ ను ఆదేశించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది.

ఇదెక్కడి అరాచకం? కేటీఆర్ ఫైర్
కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయకుండా ఈసీ విధించిన నిషేధంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదెక్కడి అరాచకం? అని నిలదీశారు. ఏకంగా తెలంగాణకి ఆవాజ్ కేసీఆర్ గొంతుపై నిషేధమా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? రేవంత్ అనుచిత వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? అని నిలదీశారు కేటీఆర్. ఈ మేరకు ఆయన X లో ట్వీట్ చేశారు.

 

Also Read : నన్ను బెదిరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

 

 

ట్రెండింగ్ వార్తలు