Paddy Nursery : తెలుగు రాష్ట్రాల్లో వరినారుమళ్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి . నేరుగా వరి విత్తే విధానాలు చాలా ప్రాంతాల్లో ఆచరణలో వున్నా, చాలామంది రైతులు నారుమళ్ల ను పెంచి, నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. సాగునీటి లభ్యత తక్కువ వున్న రైతులు పొడి దుక్కిలో విత్తనం వెదజల్లుతుండగా, నీటి సౌలభ్యం వున్న రైతులు దమ్ముచేసి నారు మళ్లు పోస్తున్నారు . మరి ఆరోగ్యవంతమైన నారు అందిరావాలంటే , యాజమాన్యంలో ఎటువంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
READ ALSO : Cultivation of Vegetables : ఖరీఫ్ లో వరి సాగు.. రబీలో కూరగాయల సాగు
నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా, అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు . మరి నారు పుష్ఠిగా పెరిగి, 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే , విత్తనశుద్ది, పోషక యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సీనియర్ శాస్త్రవేత్త డా. మానుకొండ శ్రీనివాస్.
READ ALSO : Prawn Farming : అమాంతం పడిపోయిన రొయ్య ధరలు.. ఆందోళనలో పశ్చిమగోదావరి జిల్లా రొయ్య రైతులు
దంపనారు మళ్లు పోసే రైతాంగం అంటే దమ్ముచేసి మండెకట్టిన విత్తనాన్ని మడిలో చల్లే రైతాంగం తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే సకాలంలో కలుపు నివారణ , చీడపీడలకు అడ్డుకట్టవేయటం చాలా ముఖ్యం. ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ వుండకుండా చూసుకోవాలి . నీరు నిల్వ వుంటే విత్తనం మురిగిపోతుంది . మడుల మధ్య కాలువలు ఏర్పాటుచేసుకుంటే నీరు నిల్వ వుండదు. ఏ కారణం చేతైనా పోషకాలను సకాలంలో అందించని రైతాంగం, పిచికారీ రూపంలో అందిస్తే మంచిది.