Bride Srujana Postmortem : విశాఖ మధురవాడలో నవవధువు సృజన పెళ్లిపీటలపైనే మృతి చెందిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా, సృజన మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. డీటైల్డ్ పోస్టుమార్టం రిపోర్ట్స్ కావాలని పోలీసులు కోరారు. మరోవైపు సృజన హఠాన్మరణంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయని, సృజన ఇష్టంతోనే పెళ్లి ఏర్పాట్లు చేసినట్లు బంధువులు చెబుతున్నారు.
వధువు, వరుడి కుటుంబాలకు ముందే చుట్టరికం ఉందంటున్నారు. ఎవరినీ బలవంతం పెట్టలేదన్నారు. సృజనకు ఎలాంటి ఎఫైర్లు లేవని బంధువులు స్పష్టం చేశారు. సృజనకు రెండు రోజులుగా ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో చూపిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు సృజన ప్రాథమిక చికిత్స రిపోర్ట్ లో మాత్రం ఆమె శరీరంలో మోతాదుకు మించి విష పదార్దాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు సృజన గన్నేరు పప్పు తీసుకున్నట్లు ఆసుపత్రి రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. అలాగే, సృజన హ్యాండ్ బ్యాగ్ లోనూ గన్నేరుపప్పు అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సృజన సెల్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.(Bride Srujana Postmortem)
మరోవైపు సృజన మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పెళ్లిపీటలపైనే స్పృహ కోల్పోయి, కాసేపటికే కన్నుమూసిన సృజనకు కన్నీటి వీడ్కోలు పలికారు బంధువులు. పోస్టుమార్టం తర్వాత సృజన మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు వైద్యులు. మృతదేహాన్ని మధురవాడలో సృజన ఇంటికి తరలించారు.
Bride Death: జీలకర్ర బెల్లం పెడుతుండగా పెళ్లి పీటలపైనే పెళ్లి కూతురు హఠాన్మరణం
పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే కుప్పకూలింది. ఆ వెంటనే మృతి చెందింది. విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటన సంచలనంగా మారింది. నవవధువు మృతి కేసులో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నవ వధువు సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పీటల మీదనే కుప్పకూలిన సృజనను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్దారించారు.
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని భావించిన ఆ పెళ్లి కూతురుకి.. పీటలపైనే నిండు నూరేళ్లు నిండాయి. పసుపు వస్త్రాల్లో కొత్త పెళ్లికూతురిలా తమ కుమార్తెను చూసి ఆనంద బాష్పాలు కార్చిన ఆ తల్లిదండ్రులకు.. తీరని దుఃఖం మిగిలింది. పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయానికే వధువు కుప్పకూలి, అనంతరం మృతి చెందింది.
తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ వివాహం సృజనతో నిశ్చయించారు పెద్దలు. బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం కాగా, సరిగా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. వివాహానికి నెలసరి (బహిష్టు) అడ్డం వస్తుందని సృజనకు వారి తల్లిదండ్రులు ఓ ట్యాబ్ లెట్ ఇచ్చారని, అది వికటించి చనిపోయి ఉంటుందని సృజన బంధువులు చెబుతున్నారు. అయితే, సమయం గడిచేకొద్దీ ఈ కేసులో షాక్ కి గురి చేసే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.