Chandrababu: యుక్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగువారితో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆన్ లైన్లో సమావేశం అయ్యారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. యుక్రెయిన్లో తెలుగు విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు సాయం కోసం కేంద్రంతో మాట్లాడారు.
ఈమేరకు భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్తో ఫోనులో మాట్లాడిన చంద్రబాబు.. అక్కడి విద్యార్థుల పరిస్థితిని వివరించి విద్యార్థుల తరలింపుకు అవసరమైన సాయం చెయ్యాలని కోరారు. యుక్రెయిన్లో చిక్కుకున్న 311 మంది తెలుగు విద్యార్థుల వివరాలను విదేశాంగ మంత్రి జైశంకర్కు పంపారు చంద్రబాబు.
విద్యార్థుల పేర్లు, వారు చిక్కుకుపోయిన ప్రాంతం, కాంటాక్ట్ డిటెయిల్స్ కేంద్ర మంత్రి జైశంకర్కి, ప్రధాన కార్యదర్శికి పంపారు చంద్రబాబు. ఆహారం, వసతి, రవాణా సదుపాయం లేక తెలుగు విద్యార్ధులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించారు చంద్రబాబు. వెంటనే వారిని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చెయ్యాలని కోరారు.