CM Jagan On Meters : వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చుతామన్నారు. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా జగన్ ఈ ప్రకటన చేశారు. ఏపీలో త్వరలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ బోర్లకు మీటర్ల పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని జగన్ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటు వల్ల నాణ్యమైన విద్యుత్ అందుతుందన్న జగన్… త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతామన్నారు. దీని ద్వారా రైతులకు మెరుగైన విద్యుత్ ఇవ్వగలమని, 30శాతం విద్యుత్ ఆదా అవుతోందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే సాగు మోటార్లకు మీటర్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. దీన్ని తిప్పికొట్టి.. జరుగుతున్న మేలును రైతులకు వివరించాలన్నారు.
ఈ నెలలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన జగన్… జూన్ మొదటి వారంలో రైతులకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తామన్నారు. అదే నెలలో 3వేల ట్రాక్టర్లు సహా, 4014 వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేస్తామని, 402 హార్వెస్టర్లను కూడా కమ్యూనిటీ హైరింగ్సెంటర్లకు ఇవ్వనున్నామని తెలిపారు. సమీక్షలో భాగంగా వ్యవసాయ రంగానికి ఇస్తున్న విద్యుత్, రైతు భరోసా, రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై జగన్ సమీక్షించారు.