Botcha Satyanarayana-Volunteer System: వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం అంత సేఫ్ కాదంటున్నారు పవన్ కల్యాణ్. డేటా సేకరణ వెనుక పెద్ద కుట్ర ఉందని పవన్ అనుమానం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. వాలంటీర్ల గురించి పవన్ చేసిన ఆరోపణలపై వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. పవన్ మతి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై స్పందించారు. పవన్ కల్యాణ్ తీరుపై మంత్రి బొత్స విరుచుకుపడ్డారు.
”పవన్.. వాలంటీర్ల వ్యవస్థను కించపరిచారు. కించపరిచే విధంగా మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వాలంటీర్లుగా కుటుంబ సభ్యులనో.. పక్కింటి వాళ్లనో నియమించాం. వాలంటీర్లు ఎందుకు మహిళలను కిడ్నాప్ చేస్తారు?
వాలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వ వ్యవస్థల వల్ల ఇబ్బందులు వస్తే.. ప్రభుత్వానిదే బాధ్యత. జనసేన కార్యకర్తపై సీఐ ఏదో చేయి చేసుకుందని కంప్లైంట్ చేయలేదా..? ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఏదైనా చేస్తే దానికి ప్రభుత్వానిదే బాధ్యత. ఏపీ ప్రజలు బందిపోటు దొంగలా..? దోపిడీదారులా..? డేటా సేకరించడం అనేది ఇప్పుడే కొత్తగా చేయడం లేదు. గత ప్రభుత్వాలూ డేటాను సేకరించాయి. గత ప్రభుత్వంలో జరిగింది డేటా చోరీ. ఆ ప్రభుత్వం ప్రజల డేటాని ఎన్నికల కోసం వాడుకుంది.
మేం ప్రజల క్షేమం కోసం డేటాని రాజ్యాంగబద్దంగా సేకరిస్తున్నాం. సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామని.. వాలంటీర్ల వ్యవస్ధను రద్దు చేస్తామని చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వంతో పవన్ సంబంధం పెట్టుకోమనండి. కేంద్రంతో కాకుంటే అమెరికా గత ప్రెసిడెంట్ బరాక్ ఒబామాతో పెట్టుకోవచ్చు. లేదా ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ తోనూ పవన్ సంబంధం పెట్టుకోవచ్చు. కేంద్రంతో పరిచయాలున్నాయంటూ పవన్ ఎవరిని బెదిరిస్తున్నారు..? ఇంతకు మించి పవన్ గురించి మాట్లాడేదేం లేదు. పవన్ కళ్యాణ్ చేసేది కామెడీ కాక మరేమిటి? మీకు కామెడీ అనిపించ లేదా?” అని మంత్రి బొత్స అన్నారు.
Also Read..YS Jagan: సీఎం జగన్ మనసులో ఏముంది.. సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఖరారు చేస్తారా?