ప్లాన్ B అమలు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి..! బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనమే టార్గెట్‌

బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు చేరాల్సివుంది. ప్రస్తుతం 10 మంది చేరడంతో ఇంకా టార్గెట్‌ను చేరుకోడానికి 16 మంది చేరాల్సివుంది.

Gossip Garage : సమయం లేదు మిత్రమా..! రణమా.. శరణమా..! కుదిరితే కూర్చుని మాట్లాడుకుందాం.. నచ్చితే కలిసి నడుద్దాం… లేదంటే చెప్పేయండి..! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు…. ఎవరైనా మీ తలుపు తట్టొచ్చు… మాతో చేతులు కలిపితే ఉభయ కుశలోపరి లేదంటే సరేసరి…. ఇవి బెదిరింపులు కాదు.. బుజ్జగింపులు అంతకన్నా కాదు… తెలంగాణలో నయా రాజకీయం… బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం విసురుతున్న కాంగ్రెస్‌… టార్గెట్‌ను వేగంగా ఛేదించేందుకు ప్లాన్‌ బీ పై ఫోకస్‌ చేసిందట… సాధ్యమైనంత వరకు ప్లాన్‌ A… ద్వారా ఎమ్మెల్యేలను ఆకర్షించాలని నిర్ణయించిన హస్తం పార్టీ.. ఇప్పుడు ప్లాన్‌ Bని అమలు చేయాలని ఎందుకు అనుకుంటోంది..? అసలు ప్లాన్‌ Bలో ఏముంది?

కాంగ్రెస్ లో కలవరం..
తెలంగాణ రాజకీయాలు ఆస‌క్తిక‌ర‌ మలుపులు తిరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనమే టార్గెట్‌గా పావులు కదిపిన కాంగ్రెస్‌…. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటివరకు రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జరిగింది.. ఈ నెల 24న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని లీకులిచ్చింది. చెప్పిన సమయం దగ్గర పడినా… చేరతారనే ఎమ్మెల్యేలపై క్లారిటీ లేకపోవడం కాంగ్రెస్‌ను కలవరపాటుకు గురిచేస్తోందంటున్నారు.

బీఆర్‌ఎస్ శాస‌న‌స‌భాప‌క్షం విలీనం అవుతుందా?
ప్రస్తుత రాజకీయ పరిణామాలు గమనిస్తే.. నిజంగా బిఆర్‌ఎస్ శాస‌న‌స‌భాప‌క్షం విలీనం అవుతుందా? అనేది చ‌ర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అసెంబ్లీ స‌మావేశాలలోపు బిఆర్‌ఎస్ శాస‌న‌స‌భాప‌క్షం విలీనమవుతుందని.. ఫలానా ఎమ్మెల్యే పార్టీ మారతారంటూ సోషల్‌ మీడియా ద్వారా కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఏ ఇద్దరు ఒక చోట చేరినా ఎమ్మెల్యేల జంపింగ్‌ల విష‌యంపై చర్చిస్తున్నారు.

ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాల‌నే ఫిరాయింపుల‌కు శ్రీకారం..
వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాల‌నే ఆలోచ‌న‌తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌కు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 చోట్ల కాంగ్రెస్‌ గెలిచింది. మేలో జరిగిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన బలాన్ని 65కు పెంచుకుంది అధికార పార్టీ. ఐతే అసెంబ్లీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 61కి కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉండటం… అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం చాలెంజ్‌గా మారుతుందనే ఆలోచనతో ఆపరేషన్‌ ఆకర్ష్‌ స్టార్ట్‌ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో విలీనం ప్లాన్‌..
ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో బీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నాళ్లు సర్కారును నడుపుతుందో చూస్తామంటూ సవాల్‌ విసరడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని నిర్ణయించింది కాంగ్రెస్‌. ఇలా పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రారంభించగా, ఇప్పటివరకు 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గుప్పిట పట్టింది. ఐతే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో బీఆర్‌ఎస్‌ ఎల్పీని విలీనం చేసుకోవాలని ప్లాన్‌ వేసింది.

ప్లాన్ బీని తెరపైకి తెచ్చిన కాంగ్రెస్…
బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు చేరాల్సివుంది. ప్రస్తుతం 10 మంది చేరడంతో ఇంకా టార్గెట్‌ను చేరుకోడానికి 16 మంది చేరాల్సివుంది. ఐతే ఇప్పటివరకు వారు వస్తారు.. వీరు వస్తారని ప్రచారం చేయడమే కానీ, పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ కనిపించకపోవడంతో ప్లాన్‌ బీ అమలు చేయాలని నిర్ణయిందట కాంగ్రెస్‌… ఈ నెల 24లోగా బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం పూర్తి చేయాలని భావించిన కాంగ్రెస్‌… ఆ పని పూర్తి చేయడానికి వ్యూహం మార్చి… ప్లాన్‌ బీని తెరపైకి తేవడంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

తమ వలకు చిక్కని ఎమ్మెల్యేల‌ బ‌లహీన‌త‌ల‌పై దెబ్బకొట్టే ప్లాన్..!
పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అనర్హత కత్తి వేలాడుతోంది. బిఆర్‌ఎస్ సైతం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై చ‌ర్యలు తీసుకోవాలంటూ.. ఒక‌వైపు స్పీక‌ర్‌పై ఒత్తిడి తెస్తూనే.. మ‌రోవైపు న్యాయ‌పోరాటం చేస్తోంది. దీంతో బిఆర్‌ఎస్ శాస‌న‌స‌భాప‌క్షాన్ని విలీనం చేసుకోక తప్పదని భావించిన కాంగ్రెస్‌ హైకమాండ్‌.. ప్లాన్ బి అమ‌లు చేయాల‌ని నిర్ణయించినట్లు సమాచారం. తమ వలకు చిక్కని ఎమ్మెల్యేల‌ బ‌లహీన‌త‌ల‌పై దెబ్బకొట్టడం ద్వారా… వారిని తమ పార్టీలోకి తెచ్చుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు… అధికారం చేతిలో ఉండ‌టంతో ఎంపిక చేసిన ఎమ్మెల్యేల‌ను టార్గెట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయోగం కొంత ఫలించి… కొంద‌రు ఎమ్మెల్యేలు స‌రెండ‌ర్ అయ్యార‌ని అంటున్నారు.

రేపోమాపో వారు కండువా మార్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో మిగిలిన ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వంపై ప‌బ్లిక్‌లో పాజిటివ్ టాక్ ఉంటే ఎమ్మెల్యేలు ఆటోమెటిక్‌గా వ‌స్తార‌ని.. అందుకోసం ప్రజ‌ల‌ను ఆకర్షించే ప‌థ‌కాల‌పై సీఎం రేవంత్ ఫోక‌స్ పెట్టారు.

సీఎం రేవంత్ ఎప్పటిలోగా లక్ష్యాన్ని చేరుకుంటారో?
మొత్తం మీద బిఆర్‌ఎస్ శాస‌న‌స‌భాప‌క్షాన్ని విలీనం చేసుకోవ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. ఈ విష‌యంలో పార్టీలో ప‌లువురు సీనియర్లు, లోక‌ల్ లీడ‌ర్లు వ్యతిరేకిస్తున్నా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకే వెళ్తున్నారు. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో కాక‌పోయినా.. అటు ఇటుగా బిఆర్‌ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల టాక్‌. మొత్తానికి బీఆర్‌ఎస్‌ ఖేల్‌ ఖతం దిశగా అడుగులు వేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పట్లోగా తన లక్ష్యాన్ని చేరుకుంటారో చూడాల్సివుంది.

Also Read : సీఎం రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్యాప్ మొదలైందా? ఆ అధికారి విషయం చిచ్చు పెట్టిందా?

 

ట్రెండింగ్ వార్తలు