Pawan Kalyan – Janasena: ” దశాబ్దాలుగా ఉన్న పార్టీలు కూడా వైసీపీ (YCP) నాయకులకు బయపడితే మనం చెప్పు తీసి చూపించాం, అది మన బలం ” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భవిష్యత్తులో వైసీపీని ఎదుర్కొనేది జనసేన పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కత్తిపూడిలో ఆయన వారాహి విజయ యాత్ర (Varahi Vijaya Yatra) ప్రారంభించి ప్రసంగించారు.
మొత్తం రాజకీయం ఆంధ్రప్రదేశ్ నుంచే చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్కడిగా పోటీ చేయి అని కొందరు అంటున్నారని చెప్పారు. ఒక్కడిగా వస్తానా? కూటమిగా వస్తానా? ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. కచ్చితంగా నిర్ణయం తీసుకున్న రోజు కుండ బద్ధలుకొట్టినట్టు చెప్పి ఎన్నికలకు వెళ్తామని అన్నారు.
తాను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా కక్షగట్టి ఓడించారని ఆరోపించారు. ఈ సారి తాను అసెంబ్లీలోకి రాకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానని పవన్ కల్యాణ్ సవాలు విసిరారు. ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ బలమైన సంతకం చేస్తుందని చెప్పారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టి తీరుతానని అన్నారు. ముఖ్యమంత్రి అవినీతిని అడిగే వ్యక్తులు ఎవరు ఉన్నారని నిలదీశారు. పాలించేవారికి మనం బానిసలం కాదని అన్నారు.
ప్రజలే ఆ విషయంపై నిలదీయాలని పవన్ కల్యాణ్ చెప్పారు. తప్పు చేస్తే తాను శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన చే గువేరా పుట్టిన రోజు ఇవాళ అని చెప్పారు. యాదృచ్ఛికంగా ఇవాళ యాత్ర ప్రారంభించానని, తనకు రాజకీయాలకు స్ఫూర్తినిచ్చిన వారిలో ఆయన ఒకరని తెలిపారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయి
ఏపీలో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయని పవన్ కల్యాణ్ అన్నారు. ముందస్తు ఎన్నికలు రావని సీఎం కథలు చెబుతున్నారని తెలిపారు. సీఎం ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడుతున్నారని, ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు.
గత 2 రోజులుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం చేశామని పవన్ కల్యాణ్ అన్నారు. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా అభివృద్ధి సంపూర్ణంగా జరగాలని యాగం చేసి దిగ్విజయంగా పూర్తి చేశానని, అనంతరం వారాహి విజయ యాత్ర మొదలు పెట్టానని తెలిపారు.
Pawan Kalyan: ఎలా ఆపుతారో చూస్తా.. నేను గొడవపెట్టుకునేది ఎవరితోనో తెలుసా?: పవన్ కల్యాణ్