కొడాలి నాని పీఏపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి.. తీవ్రగాయాలు
లక్ష్మోజీ ప్రస్తుతం మచిలీపట్నం కలెక్టరేట్ లోని పౌరసరఫరాల విభాగం ఆర్ఐగా పనిచేస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకొని మచిలీపట్నం నుంచి రైలులో ..
- Harishth Thanniru
- Published On : July 23, 2024 / 07:30 AM IST
Kodali Nani PA Lakshmoji
Kodali Nani PA Lakshmoji : వైసీపీ నేత, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ పీఏ అచంట లక్ష్మోజీపై దాడి జరిగింది. మచిలీపట్నంలో విధులు నిర్వహించుకొని వస్తున్న లక్ష్మోజీపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రైల్వే స్టేషన్ పక్కనే సీఎస్ఐ చర్చి ఆవరణలో గుర్తుతెలియని ఎనిమిది మంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో లక్ష్మోజీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గుడివాడ ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం స్థానికులు అతన్ని తరలించారు. తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యంకోసం అతన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read : జగన్కు దమ్ముంటే.. వాళ్ల బాబాయి హత్యపై ఢిల్లీలో ధర్నా చేయాలి- మహిళా మంత్రి సవాల్
లక్ష్మోజీ ప్రస్తుతం మచిలీపట్నం కలెక్టరేట్ లోని పౌరసరఫరాల విభాగం ఆర్ఐగా పనిచేస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకొని మచిలీపట్నం నుంచి రైలులో గుడివాడ చేరుకున్నాడు. రైల్వే స్టేషన్ పక్కనే సీఎస్ఐ చర్చి ఆవరణలో తన ద్విచక్ర వాహనాన్ని తీస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. లక్ష్మోజీపై దాడిచేసి అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న లక్ష్మోజీని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ గంగాధరరావు గుడివాడ చేరుకొని సీఎస్ఐ చర్చి వద్ద ఘటన స్థలిని పరిశీలించారు. దాడి ఘటనపై స్థానిక పోలీసులు, ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Also Read : బీజేపీవైపు వైసీపీ నేతల చూపు..! మంత్రి లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ
లక్ష్మోజీపై దాడిచేసింది ఎవరనే అంశంపై ప్రస్తుతం గుడివాడలో చర్చనీయాంశంగా మారింది. అతనిపై దాడిచేసింది గతంలో వైసీపీలోని వాళ్లా.. ఇతర వ్యక్తులా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అతనిపై దాడిలో పాల్గొంది ఎనిమిది మందేనా.. ఇంకా ఎవరైనా ఉన్నారా.. లక్ష్మోజీకి ఎవరితోనైనా పాత గొడవలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే.. లక్ష్మోజీపై దాడి జరిగిందని తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
