Godavari Flood At Dhavaleswaram Barrage
Godavari Flood At Dhavaleswaram Barrage : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సోమవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. కాటన్ బ్యారేజ్ వద్ద 175గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని వదులుతున్నారు. సుమారు 13లక్షల14వేలు క్యూసెక్కుల నీటిని దిగు ప్రాంతానికి వదులుతున్నారు. మంగళవారం ఉదయం ఏడు గంటల వరకు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14 అడుగులకు నీటి మట్టం చేరింది. ఏజెన్సీలో గంటగంటకు వరద ప్రభావం పెరగడంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Also Read : భద్రచాలం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి, తుంగభద్ర జలాశయానికి పోటెత్తిన వరద
చింతూరు జాతీయ రహదారి (NH)30పై వరద నీరు చేరింది. చింతూరు నుండి భద్రాచలం వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వి.ఆర్.పురం మండలం చింతరేవుపల్లి, తుష్టివారి గూడెం గ్రామాల వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద బ్రిడ్జిని ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుంది. నాలుగు మండలాల్లో సుమారుగా 250 గ్రామాలకు రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు గ్రామాల ప్రజలను అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అప్రమత్తం చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడానికి 18 లాంచీలను అధికారులు ఏర్పాటు చేశారు.
Also Read : ఈ ఘటనలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించబోం.. పెద్దిరెడ్డిపై అనుమానాలు: మదనపల్లె ఘటనపై మంత్రి అనగాని
దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలోకి చిక్కుకుపోయింది. సీతానగరం మండలం మిర్తిపాడు బొబ్బిలంక దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. పి. గన్నవరం నియోజకవర్గం గంటి పెదపూడి వద్ద సుమారు నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయినవిల్లి మండలం ఎదుర్మిడియం గాజువాక పైకి వరద చేరుకోవడంతో ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలం కనకాయలంక కాజ్ వే నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏటిగట్ల పరిస్థితిని పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.