CM Chandrababu Naidu : అడ్డంకులు సృష్టించడం తగదు.. ఫారెస్ట్ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్
CM Chandrababu Naidu : రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
CM Chandrababu Naidu
- ఫారెస్ట్ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్
- గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలకు అడ్డంకులు సృష్టించడం తగదు
- సమస్యలు ఉంటే తనకు లేదా పవన్ కల్యాణ్కు తెలియజేయాలి
CM Chandrababu Naidu : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో గురువారం రెండోరోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వైల్డ్ లైఫ్ సాంక్చురీ పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరైంది కాదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలకు కూడా అడ్డంకులు సృష్టించడం తగదని అన్నారు.
ప్రభుత్వం ఆమోదించిన ఇళ్లకు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడం ఏమిటని సీఎం చంద్రబాబు నాయుడు అటవీ అధికారులను ప్రశ్నించారు. గిరిజనులకు నీరు, రహదారి, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న రహదారిపై గ్రావెల్ లేదా మెటల్ వేయడానికీ అభ్యంతరం చెప్పడం ఎందుకని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. అధికారుల వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. ఫారెస్ట్ అధికారుల తీరువల్లే ఇబ్బందులు పెరుగుతున్నాయని అన్నారు. మీ ఆటిట్యూడ్ అబ్జెక్షనబుల్.. మీపై చాలా కంప్లైంట్లు వస్తున్నాయి అంటూ సీఎం చంద్రబాబు అన్నారు.
సమస్యలు ఉంటే నేరుగా తనకు లేదా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించవద్దని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు కలెక్టర్, డీఎఫ్వో కలిసి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. అభివృద్ధి పనులు ఆగిపోకుండా సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
