Amaravati Farmers Maha Padayatra : అమరావతి రైతులకు రూ.5లక్షలు.. పాదయాత్రకు సాయంగా మాజీమంత్రి విరాళం

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతు కొనసాగుతోంది. రైతు యాత్రకు సాయంగా తమ వంతుగా రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు.

Amaravati Farmers Maha Padayatra : అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతు కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు వారికి మద్దతుగా యాత్రలో పాల్గొంటున్నారు. తమ వంతుగా స్వచ్చందంగా విరాళాలు అందిస్తున్నారు.

రైతుల పాదయాత్రకు మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, పూర్ణ వీరయ్య మద్దతు తెలిపారు. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. రైతు రథానికి పూజలు నిర్వహించారు. అనంతరం రైతు యాత్రకు సాయంగా తమ వంతుగా రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు. రైతులు చేస్తున్న పోరాటాన్ని పిన్నమనేని అభినందించారు. వారికి తమ మద్దతు ప్రకటించారు.

అమరావతి నుంచి అరసవల్లికి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలో ప్రవేశించింది. గుడివాడ ప్రజలు రైతులకు సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడొచ్చన్న నేపథ్యంలో పట్టణంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున రోప్ పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. గుడివాడ చేరుకున్న రైతులను పోలీసులు రోప్ ల నడుమ ముందుకు తీసుకెళుతున్నారు. ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత మధ్య రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు బైక్ పై గుడివాడ చేరుకున్నారు.

కాగా, గుడివాడలో రైతుల పాదయాత్ర నేపథ్యంలో, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చింతమనేని గుడివాడ వెళతారన్న అంచనాల నేపథ్యంలో ఏలూరులోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చింతమనేనికి నోటీసులు అందజేశారు.

ట్రెండింగ్ వార్తలు