CM Jagan : ఈసారి 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయం అంటున్న జగన్ ధీమాకు కారణం ఏంటి?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఎవరూ ఊహించని రేంజ్ లో హీటెక్కాయి. CM Jagan Confidence

CM Jagan Confidence

CM Jagan Confidence : ఏపీ ముఖ్యమంత్రి జగన్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎమ్మెల్యేల సమావేశంలో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. టీడీపీ, జనసేన పొత్తు.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ ఏదో అయిపోతుంది అనేది కేవలం ఒక భ్రమగా తేల్చేశారు సీఎం జగన్. తన ప్రభుత్వాన్ని ఓడించలేకే విపక్షాలు పొత్తులు పెట్టుకున్నాయనే విషయాన్ని గ్రహించాలని కేడర్ లో ధైర్యం నూరిపోశారు సీఎం జగన్.

వైసీపీ అంత బలంగా ఉందా?
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమమే అజెండాగా ఏపీలో పాలన సాగిస్తున్న సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో 175కు 175 నియోజకవర్గాల్లో గెలుస్తానని విశ్వాసంతో ఉన్నారు. తాజాగా జరిగిన ఎమ్మెల్యేల భేటీలోనూ అదే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. నిజంగా ఏపీలో వైసీపీ అంత బలంగా ఉందా? సీఎం జగన్ ధీమాకు కారణం ఏంటి?

వైసీపీతో తాడో పేడో తేల్చుకుంటామని శపథం..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఎవరూ ఊహించని రేంజ్ లో హీటెక్కాయి. చంద్రబాబు జైలుకి వెళ్లాకే టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన వచ్చింది. రెండున్నరేళ్లుగా తెరచాటు రాజకీయంతో ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఈ రెండు పార్టీలు తమ రాజకీయ ఆకాంక్షను రాజమండ్రిలో బయటపెట్టాయి. ఇక వైసీపీతో తాడో పేడో తేల్చుకుంటామని శపథం చేశాయి.

సీఎం జగన్ పై జనంలో చెక్కుచెదరని అభిమానం..
ఇలా రెండు ప్రధాన పార్టీలు ఏకం కావడంతో ఏపీలో ఏదో జరిగిపోతోందనే ప్రచారం జరిగింది. అయితే, అధికార పార్టీ జరిపిన సర్వేలో ఆ రెండు పార్టీల పొత్తు ఎలాంటి ప్రభావం చూపలేదనే విషయం వెల్లడైందని సమాచారం. అధికార వైసీపీని ఎదుర్కొనలేకనే ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని, ఇప్పటికీ సీఎం జగన్ పై జనంలో అభిమానం చెక్కుచెదరలేదని అధికార పార్టీ సర్వేల్లో తేలిందని వైసీపీ ఇంటర్నల్ టాక్.

Also Read: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?

జగన్ పై ప్రజల ప్రత్యేక అభిమానం..
2019 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన సీఎం జగన్ విస్తృతంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనాకర్షక పథకాలు అందజేయడం, కరోనా కాలంలోనూ ప్రజలకు చేదోడుగా నిలవడంతో సీఎం జగన్ పై ప్రజలు ప్రత్యేక అభిమానం పెంచుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విషయం ప్రస్పుటమైంది. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ అవుతుందని వైసీపీ సర్వేల్లో తేలిందని చెబుతున్నారు.

ఆ ఎమ్మెల్యేలకు కష్టమే..
సీఎం జగన్ పనితీరుపై పూర్తి సానుకూల వాతావరణం కనిపిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని గుర్తించింది వైసీపీ అధిష్టానం. పార్టీ రహస్య సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉండటం లేదని తేలింది. గతంలో కూడా ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. పనితీరు మార్చుకోకపోతే కష్టమే అంటూ స్మూత్ వార్నింగ్ ఇచ్చారు. ఇక, తాజాగా జరిగిన సర్వేలోనూ మరోసారి ఇదే విషయం వెల్లడైందని తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోయినా కొందరు ఎమ్మెల్యేలు తమ పనితీరుతో జగన్ కు భారంగా మారుతున్నారని ఆ సర్వేల్లో తేలిందని అంటున్నారు.

Also Read: అచ్చెన్నాయుడి ప్రకటన.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారా.. బాబు స్కెచ్ ఏంటో?

మరోసారి గెలవడం పక్కా..!
మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోయే ఏపీలో రెండోసారి గెలవడం పక్కా అని పూర్తి విశ్వాసంతో ఉన్నారు సీఎం జగన్. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ తో పాటు అధికార పార్టీ జరుపుతున్న అన్ని సర్వేల్లోనూ ఇదే విషయం వెల్లడవుతోంది. సర్వేలన్నీ పూర్తి అనుకూలంగా వస్తుండటంతో సీఎం జగన్ కూడా మరింత పట్టు బిగించాలనే కోరుకుంటున్నారు. ఎన్నికలను ఏ మాత్రం అలక్షం చేయొద్దని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం కావడం అంటేనే ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందనే విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు జగన్. గతేడాది కాలంగా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు నేరుగా ప్రజల్లో తిరుగుతున్నా ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదన్న విషయాన్ని గుర్తు చేస్తోంది వైసీపీ అధిష్టానం.

స్కాములు లేకుండా స్కీములు..
గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచిన వైసీపీని ఓడించడం ప్రతిపక్షాలకు అసాధ్యం అనే విషయం కూడా సర్వేల్లో తేలిందని చెబుతున్నారు. గ్రామ వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి 50 ఇళ్లకు అందుబాటులో ఉండటమే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంతో పాటు గత నెలలో చేపట్టిన జగనన్న సురక్ష పథకం మంచి ఫలితాలను ఇచ్చింది. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు జగనన్న సురక్ష పథకంలో భాగంగా పంపిణీ చేశారు. ప్రజా అవసరాలను గుర్తించి వారికి నేరుగా స్కాములు లేకుండా స్కీములు అందజేస్తుండటంతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఏర్పడుతోంది.

Also Read: మీకు ఇక్కడేం పని అంటారా.. చంద్రబాబుపై కేటీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: నన్నపనేని రాజకుమారి డిమాండ్

ఎన్నికల వేళ కొత్త కార్యక్రమానికి శ్రీకారం..
ఇదే ఊపులో మరో రెండు నెలలు కూడా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించేలా మరో కార్యక్రమానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం. జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనన్నే కావాలి అనే రెండు కార్యక్రమాల కింద వార్డు మెంబర్ల నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు జగన్. ఇలా చేయడం వల్ల ఎన్నికల ముందు కూడా ప్రజలతో సంబంధాలు పెంచుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారు. దీనివల్ల ఎన్నికల సమయమప్పుడే కాకుండా ఎప్పుడూ వైసీపీ జనంతోనే ఉంటుందనే భావన కలుగుతుందని అంటున్నారు. జనంతోనే నాయకుడు ఉంటే ఫలితాలు ఇంకా సానుకూలంగా వస్తాయని నమ్ముతుండటం వల్ల సీఎం జగన్ వై నాట్ 175పై చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు అని చెబుతున్నారు పరిశీలకులు.

అయోమయంలో టీడీపీ శ్రేణులు..
ఇక పార్టీ, ప్రభుత్వం పనితీరు అలా ఉంచితే ప్రతిపక్షాలు ఇప్పటికీ కోలుకోలేదని అధికార పార్టీ సర్వేల్లో తేలింది. ఒంటరిగా వైసీపీని ఓడించలేమనే కారణంతోనే టీడీపీ-జనసేన దగ్గరైనట్లు సర్వే ఫలితాల్లో తేలింది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏదో సాధిస్తామని సంబరాలు చేసుకుంటున్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ కావడం రాజకీయంగా వైసీపీకి మేలు జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధినేత అరెస్ట్ తో టీడీపీ నాయకులు ఇళ్లకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

కార్యకర్తలు డీలా పడిపోగా ఎన్నికల మేనేజ్ మెంట్ లో కూడా టీడీపీకి ఎవరూ మార్గనిర్దేశనం చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. ఈ పరిస్థితులన్నీ అంచనా వేసుకునే సీఎం జగన్ మరోసారి విజయంపై ధీమా ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, ఎమ్మెల్యేలతో సమావేశంలో ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టారు. తన టీమ్ లో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేశారు జగన్.

ట్రెండింగ్ వార్తలు