సహనంతో ఉన్నాను తప్ప, చేతకాక కాదు: చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫైర్
నేను ఓడిపోయి ఉండవచ్చు, కానీ రాజకీయంగా దిగజారను. పల్లెల్లో చిచ్చు పెడుతున్నారు. అక్కడ వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టను. వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తాను.
- Naga Srinivasa Rao Poduri
- Published On : July 19, 2024 / 01:52 PM IST
Chevireddy Bhaskar Reddy: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫైర్ అయ్యారు. తిరుపతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎమ్మెల్యే నాని తప్పుడు ఫిర్యాదుల చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. పార్టీలు, కులాలకు అతీతంగా చంద్రగిరిలో 5 ఏళ్లు హుందాగా ఉన్నామని, అందరినీ సమానంగా ఆదరించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టు కేసులు ఎదుర్కొవాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు.
”గడిచిన ఐదేళ్లు చంద్రగిరి ప్రజలను ఎంతో ఆదుకున్నాను. ఇవాళ ముసుగులో వచ్చి మా పార్టీ వారిని కొడుతున్నారు. నాడు నేను సహకరించడం వల్లే ఎమ్మెల్యే నానికి చెందిన రెండు క్వారీలు సజావుగా నడిచాయి. ఎమ్మెల్యే నానికి చెందిన క్వారీలపై అధికారులు దాడులు జరపకుండా నేనే ఆపాను. నేను, నాటి మంత్రి పెద్దిరెడ్డి నీ వ్యాపారాల జోలికి రాలేదు. వ్యాపారాలు వేరు, రాజకీయాలు వేరుగా మేము భావించాము.
నాని నాపై చేస్తున్న తప్పుడు ఫిర్యాదులను చంద్రబాబు, లోకేష్ గుడ్డిగా నమ్ముతున్నారు. చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టడం కోసం లేనిపోనివి చెబుతున్నాడు. ఎన్నికల ఫలితాలకు ముందు తనపై హత్యాయత్నం పేరిట నాని ఆడిన డ్రామాలు వల్ల చాలా మంది అమాయక పోలిసులు ఉద్యోగాలు కోల్పోయి, రోడ్డున పడ్డారు. ఇప్పుడు పోలీసు అధికారుల సంఘం ఏం పీకుతోంది?
Also Read: తాడిపత్రి మున్సిపాలిటీలో ఆసక్తికర దృశ్యం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!
నేను అవినీతికి పాల్పడి ఉంటే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాను. నేను ఓడిపోయి ఉండవచ్చు, కానీ రాజకీయంగా దిగజారను. పల్లెల్లో చిచ్చు పెడుతున్నారు. అక్కడ వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టను. వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తాను. సహనంతో ఉన్నాను తప్ప, చేతకాక కాదు. భయం బతకాల్సిన అవసరం మాకు లేదు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్య్ర్తకర్తలను ఇబ్బందులు పెడితే కోర్టు కేసులతో వెళతారు జాగ్రత్త. పారదర్శకంగా పనిచేయండి, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉండాల”ని చెవిరెడ్డి అన్నారు.
