Chandrababu Naidu : రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. భవాని కుటుంబం.. ఒక రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం అని, ఒక వెనకబడిన కుటుంబం అని చంద్రబాబు చెప్పారు. ఎన్నో ఏళ్ల నుండి నీతిగా వ్యాపారం చేసుకుంటున్నారని, ఒక్క ఫిర్యాదు కూడా లేదని, ఒక్క కస్టమర్ కూడా ఫిర్యాదు చేయలేదని చంద్రబాబు అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్సీ అప్పారావును అరెస్ట్ చేస్తామని బెదిరించారని, 8 సంవత్సరాల చిన్న పిల్లాడిని కూడా బెదిరించారని చంద్రబాబు ఆరోపించారు. తనకు ములాఖాత్ ఇచ్చినందుకు ఏకంగా జైల్ సూపరింటెండెంట్ నే బదిలీ చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పారావు కుటుంబానికి ప్రజలు అండగా ఉన్నారన్న చంద్రబాబు.. అప్పారావు కుటుంబం ఏ తప్పు చేసిందని ప్రశ్నించారు.(Chandrababu Naidu)
వెనకబడిన వర్గాలను అణిచివేయడం దుర్మార్గం అన్నారు. వెంటనే పార్టీ మారాలని ఆ కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చారని మండిపడ్డారు. అప్పారావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇకపై నేను మెత్తగా ఉండను. ఎవరు తప్పు చేశారో వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని పరోక్షంగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. నీతి నిజాయితీ ఉన్న అధికారులకు తప్పకుండా న్యాయం చేస్తానన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లిన చంద్రబాబు.. ములాఖత్పై టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను పరామర్శించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.(Chandrababu Naidu)
జగత్జనని చిట్ ఫండ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్లను (వాసు-టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త) సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు వారికి మే 12 వరకు రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు అప్పారావు, వాసులను రాజమహేంద్రవరం జైలుకి తరలించారు. సీఐడీ అధికారులు రాజమహేంద్రవరంలోని ఆదిరెడ్డి ఇంటికి వెళ్లి తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్ట్ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ఆరోపించారు.