Nepali Couple Loot A House : హైదరాబాద్ లోని ఒక వ్యాపారి ఇంట్లో పనిమనుషులుగా చేరిన దంపతులు, వారిని తాళ్లతో కట్టేసి లక్షలాది రూపాయలు చోరీ చేసి పరారయ్యారు.
చింతల్ బస్తీ హిల్స్ కాలనీలో నివాసం ఉండే ఓం ప్రకాష్ అగర్వాల్, సంతోష్ అగర్వాల్ వృధ్ధ దంపతుల ఇంట్లో 20 రోజుల క్రితం నేపాల్కు చెందిన భార్యాభర్తలైన ఇద్దరు పనిమనుషులుగా చేరారు. వీరిలో భర్త దీపేష్ వాచ్ మెన్ గా పని చేస్తుండగా, భార్య అనిత శేషి ఇంట్లో సహాయకురాలిగా ఉంటోంది. శనివారం తెల్లవారు ఝూమున నేపాలీ దంపతులిద్దరూ యజమాని ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు.
తెల్లవారు ఝూమున 3 గంటల సమయంలో ఓం ప్రకాష్అగర్వాల్ నోట్లో గుడ్డలు కుక్కి, ఆయన్ను తాళ్లతో కట్టేసి బీరువా తాళం చెవులు తీసుకున్నారు. బీరువాలో ఉన్న రూ. 40 లక్షల విలువచేసే డైమండ్ ఆభరణాలు, రూ.40 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదు తీసుకుని పరారయ్యారు.
తెల్లవారిన తర్వాత మేడపై నిద్రిస్తున్న అగర్వాల్ కోడలు, మనవడు కిందకు దిగివచ్చి చూసే సరికి అగర్వాల్ తాళ్లతో కట్టి ఉండటం చూశారు. వెంటనే కట్లు విప్పి 100 కి సమాచారం ఇచ్చారు. అగర్వాల్ మనవడు యజ్ఞ అగర్వాల్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులుప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
Also Read : Special Trains : ఆది, సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లు
కాగా…. ఇంట్లో పనిమనుషులుగా పెట్టుకునే వారి వివరాలను స్ధానిక పోలీసు స్టేషన్ లో నమోదు చేయించాలని హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ ప్రజలకు సూచించారు. ఇలాంటి చోరీలు అరికట్టటానికి పోలీసులు హ్యాక్ ఐ అనే యాప్ తీసుకు వచ్చారని చెప్పారు.
ఈ యాప్ లో గతంలో చోరీలు చేసిన వారి వివరాలు ఉంటాయని…. గతంలో వారిపై కేసులుంటే తెలుసుకోవచ్చని సూచించారు. గత ఏడాది కాలంలో హైదరాబాద్ లో 38 మంది నేపాలీలు ఇళ్లలో పని మనుషులుగా చేరి చోరీలు చేశారని సీపీ చెప్పారు.