five encounters in 30 hours : వరుస ఎన్కౌంటర్లతో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. కాల్పుల మోతతో కశ్మీర్ వ్యాలీ మారుమోగుతోంది. ముష్కర మూకలు స్వైర విహారం చేస్తుండటం, అటు పౌరులు, ఇటు సైనికులను పొట్టన పెట్టుకుంటుండటంతో.. భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతలో దళాలు దూకుడు పెంచాయి. దీంతో అక్కడ కంటిన్యూగా కాల్పులు జరుగుతున్నాయి. 30 గంటల వ్యవధిలో 5 ఎన్కౌంటర్లు జరిగాయి. ఇవాళ ఒక్కరోజే షోపియాన్లో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి.
ఉదయం నుంచి భారీగా కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి. వాళ్ల దగ్గర నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక మిగిలిన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Encounter : ఒడిషాలో ఎన్కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి
అటు ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవటం ఆర్మీకి పెను సవాల్గా మారింది. కొన్ని రోజులుగా సామాన్య ప్రజలే టార్గెట్గా కశ్మీర్లో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. తుపాకీ తూటాలకు అమాయకులను బలిస్తున్నారు. తుపాకీ శబ్దాలతో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. దీంతో ఉగ్రవాదుల అంతు చూసేందుకు రంగంలోకి దిగింది ఆర్మీ. నిన్న పూంచ్ సెక్టార్లో జరిగిన భీకర కాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు మరణించారు. అందులో నలుగురు జవాన్లు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నారు.
మరోవైపు సురాన్ కోట్లోని మొఘల్ రోడ్డు సమీపంలో ఉన్న అడవుల్లోకి ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఎల్ వోసీ దాటి చార్మేర్ అడవిలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదుల గుంపు చొరబడినట్లు సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను మట్టు పెట్టడం కోసం వారు ఉన్న అటవీ ప్రాంతం నుంచి తప్పించుకునే అన్ని మార్గాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.