Woman Commit Suicide : తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టంలేదని చెప్పినా ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూడటంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని మద్దూర్ కు చెందిన తెలుగు సునీత(20) కు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని… సంబంధాలు చూడవద్దని గతంలోనే ఆమె తల్లి తండ్రులకు చెప్పింది. అయినా ఇంట్లోవాళ్లు సంబంధాలు చూస్తూనే ఉన్నారు. మరో రెండురోజుల్లో మగపెళ్లి వాళ్లు పెళ్లి చూపులకు వస్తున్నారని తల్లితండ్రులు సునీతకు చెప్పారు. తనకు ఇష్టం లేదని చెప్పినా పెళ్ళి చూపులకు కూర్చో వాల్సి రావటంతో మనస్తాపానికి గురైంది.
గురువారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్ధితిలోకి వెళ్లింది. సునీతను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోజు రాత్రి సునీత కన్నుమూసింది. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదుచేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు.