Harassment : ఓ ముద్దివ్వు..రూ.25 వేలు ఇస్తా! డాక్టర్‌ను అడిగిన పేషెంట్

ఆర్ఎంపీ వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఓ వ్యక్తిపై నిర్భయ కేసుతో పాటు ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో చోటు చేసుకుంది.

Sexually Harassment :  ఆర్ఎంపీ వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఓ వ్యక్తిపై నిర్భయ కేసుతో పాటు ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో చోటు చేసుకుంది.

మొయినా‌బాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తూ క్లినిక్ నడుపుకుంటోంది. గ్రామంలోని ప్రజలకు వచ్చే జలుబు, జ్వరంవంటి చిన్న చిన్న వ్యాధులకు చికిత్స అందిస్తూ సేవలు చేస్తోంది. గ్రామానికి చెందిన పాటి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వారం రోజుల క్రితం అనారోగ్యంగా ఉండటంతో ఆమె వద్దకు వచ్చి చికిత్స చేయించుకున్నాడు.

అనంతరం ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఫోన్ చేస్తానని చెప్పి ఆమె ఫోన్ నెంబరు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె ఫోన్ కు అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టటం మొదలెట్టాడు. అతను ఎన్ని మెసేజ్‌లు పెట్టినా ఆమె వద్ద నుంచి రిప్లయ్ రాకపోయేసరికి ఈ నెల17వ తేదీ మధ్యాహ్నం నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. ఆస్పత్రిలో ఎవరూ లేని సమయం చూసి… నువ్వంటే నాకిష్టం నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పాడు.

అంతటితో ఆగకుండా ఓ ముద్దిస్తే రూ. 25 వేలు ఇస్తా.. నీ ఆస్పత్రికి 5నెలల రెంట్ కడతానని కూడా చెప్పాడు. ఇంకా అసభ్యకరంగా మాట్లాడుతూ డాక్టర్‌ను వేధించటం మొదలెట్టాడు.  ఆ తర్వాత అతడ్ని పంపించివేసిన డాక్టర్ ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు ప్రసాద‌రెడ్డిని అడగటానికి ఇంటికి వెళ్లగా అప్పటికే ఆయన ఇల్లు వదిలి పారిపోయాడు.

వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రసాద‌రెడ్డి పై నిర్భయ కేసుతో పాటు ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు