Atiq Ahmed Murder: మాజీ ప్రజా ప్రతినిధి, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ను పోలీసుల మధ్యలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో దారుణ హత్యకు గురయ్యారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఈ దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన అతడి కుమారుడి అంత్యక్రియలకు తమను అనుమతించకపోవడంపై మీడియాతో చివరి సారిగా అతీక్ అహ్మద్ మాట్లాడారు. ‘‘మై బాత్ యే హై కీ గుడ్డూ ముస్లిం..’’ అని అతీక్ అహ్మద్ అంటుండగా పోలీసులు, మీడియా మధ్యలోకి వచ్చిన దుండగులు పాయింట్ బ్లాకులో కాల్చారు.
పోలీసు జీపు దిగి ముందుకు వచ్చిన అతీక్ అహ్మద్ను మీడియా ప్రశ్నిస్తూ మీ స్టేట్మెంట్ ఏంటని ప్రశ్నించింది. ‘‘దేని మీద స్టేట్మెంట్?’’ అని ప్రశ్నించారు. దానికి కొనసాగింపుగా ఆయన మాట్లాడుతూ “నహీ లే గయే తో నహీ లే గయే” అని అన్నారు. అనంతరం గుడ్డు ముస్లిం మీద స్పందించబోతుండగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. ప్రయాగ్రాజ్లోని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తున్న ఎంఎల్ఎన్ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి సమీపంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన ముగ్గురు షూటర్లను లవ్లేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా ఉత్తరప్రదేశ్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
Uttar Pradesh: అతిక్ అహ్మద్ హత్య.. యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
అత్యంత సమీపం నుంచి కాల్పులు జరుపుతుండగా కాల్పులకు పాల్పడ్డ వారి ముఖం కెమెరాలో దాదాపుగా కనిపించింది. కాగా ఈ దాడిలో మాన్ సింగ్ అనే పోలీసు కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి. గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ను ముగ్గురు దుండగులు హత్య చేసిన వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. పోలీసు డైరెక్టర్ జనరల్, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తో సహా యుపి పోలీసు సీనియర్ అధికారులను ఉన్నత స్థాయి సమావేశానికి పిలిచి మాట్లాడారు.