Magnesium
Magnesium : మన శరీరానికి అవసరమైన ఖనిజాల్లో మెగ్నీషియం అత్యంత అవసరమైన ఖనిజం. శరీరానికి శక్తిని ఇవ్వటంతోపాటు రాత్రిళ్లు నిద్ర పట్టేలా చేస్తుంది. హార్మోన్స్ సక్రమం పనితీరుకు సాయపడుతుంది. బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తుంది. ఆకుకూరలు, కూరగాయల్లో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. ఎముకలు గట్టిగా ఉండాలన్నా, మన నరాలు, నాడీ వ్యవస్థ పనితీరుకు దోహదపడుతుంది.
శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఆకలిలేమి, వికారం, వంటి సమస్యలు వస్తాయి. నీరసం, గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్లకు మసకగా అనిపిస్తుంది. కండరాల్లో నొప్పి వస్తుంటుంది. అలసటగా ఉంటుంది. టెన్షన్ పెరుగుతుంది. నిద్ర సరిగా పట్టదు. హైబీపీ వస్తుంది. ఆస్తమా సమస్య కూడా పెరుగుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారిలో చాలా మందికి కండరాల నొప్పులు వస్తుంటాయి. కండరాలు పట్టేసినట్లు అనిపిస్తాయి. నిద్రలేమిని తగ్గించుకునేందుకు మెగ్నీషియం దోహదపడుతుంది.
డయాబెటిస్, పాంక్రియాటైటిస్, హైపర్ థైరాయిడిజం, కిడ్నీ వ్యాధులు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వ్యాధులు, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ తదితర వ్యాధులు ఉన్నవారిలో సహజంగానే మెగ్నిషియం లోపం వస్తుంటుంది. ఆల్కహాల్, సోడా, కాఫీ వంటి డ్రింక్స్ను ఎక్కువగా తీసుకునేవారిలో మెగ్నిషియం లోపిస్తుంది. రుతుస్రావం తీవ్రంగా అయ్యే మహిళలు, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు, చెమట బాగా పట్టేవారికి కూడా మెగ్నిషియం లోపం గుర్తించవచ్చు.
రోజువారిగా శరీరానికి ఎంత మెగ్నీషియం అవసరం అన్నదానిపై నిపుణులు చెబుతున్న దాని ప్రకారం సుమారుగా పురుషులకు 400మిల్లీ గ్రాములు, మహిళలకు 300మిల్లీ గ్రాములు అవసరమతుంది. రోజువారిగా తీసుకునే ఆహారాల ద్వారా ఈ మోతాదును శరీరానికి అందించవచ్చు. వైద్యుల సలహా మేరకు లోపం ఉన్నవారు సప్లిమెంట్లు తీసుకోవాలి. అయితే సప్లిమెంట్లు మోతాదు మించితే వికారం, కడుపులో నొప్పి, డయేరియా వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మెగ్నీషియం ఆహారం ద్వారా శరీరానికి అందించటం ఉత్తమమైన మార్గం. అరటిపండ్లు, పాలకూర, జీడిపప్పు, బాదంపప్పు, అవకాడోలు ఇతర నట్స్, బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు, విత్తనాలు, బీన్స్, పప్పు దినుసులు, పచ్చి బఠానీలు, శనగలు, పాలు, పెరుగు, సోయా పిండి, ఇతర సోయా ఉత్పత్తులలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది.