Jesus Alberto Lopez Ortiz
Jesus Alberto Lopez Ortiz : కోస్టారికాలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాకర్ ఆటగాడు ఈత కొట్టేందుకు నదిలోకి దిగగా మొసలి అతడిపై దాడి చేసింది. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆ ఆటగాడిని 29 ఏళ్ల జీసస్ అల్బెర్టో లోపెజ్ ఓర్టిజ్(Jesus Alberto Lopez Ortiz) గా గుర్తించారు. కోస్టారికా రాజధాని శాన్ జోస్ నుండి దాదాపు 140 మైళ్ల దూరంలో గ్వానాకాస్ట్ ప్రావిన్స్లోని శాంటా క్రూజ్ పట్టణానికి సమీపంలో ఈ ఘటన జరిగింది.
వ్యాయామంలో భాగంగా లోపెజ్ ఓర్టిజ్.. కెనాస్ నది వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు నదిలో మొసళ్లు ఉంటాయని, ఇక్కడ ఈత కొట్టడం ప్రమాదం అని అతడిని హెచ్చరించారు. అతడు వారి మాటను లెక్కచేయలేదు. కొద్ది దూరంలో చేపలు పట్టేందుకు ఏర్పాటు చేసిన ఓ చిన్న వంతెన పై నుంచి కిందకు దూకి ఈత కొడుతూ ఉన్నాడు. కాసేపటి తరువాత ఓ మొసలి అతడి వైపు రావడాన్ని గమనించిన స్థానికులు అతడిని హెచ్చరించే లోపే అది అతడిపై దాడి చేసింది. మొసలి అతడిని నీళ్లలోకి లాక్కుని వెళ్లిపోయింది. వెంటనే వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా అల్బెర్టో లోపెజ్ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.
కోస్టారికన్ అసెన్సో లీగ్ ఫుట్బాల్ జట్టు ఫేస్బుక్లో అతడి మరణాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘మా ఆటగాడు జీసస్ లోపెజ్ ఒర్టిజ్ (చుచో) మరణాన్ని తీవ్ర విచారంతో మేము బహిరంగపరుస్తున్నాం’ అని తెలిపింది. ‘ఈ రోజు మనందరికీ చాలా కష్టమైన రోజు. కోచ్గా, ప్లేయర్గా, కుటుంబ వ్యక్తిగా మీ క్రీడా జీవితంలోని అనేక కోణాల్లో మేము మిమ్మల్ని గుర్తుంచుకుంటాము. మీరు ఎల్లప్పుడూ మా హృదయాలలో జీవిస్తారు.’ అంటూ రాసుకొచ్చింది.
సాకర్ ఆటగాడి అవశేషాలను వెలికి తీయడానికి, మొసలిని కాల్చడానికి పోలీసులు తుపాకీలను ఉపయోగించాల్సి వచ్చిందని స్థానిక రెడ్క్రాస్ తెలిపింది.