Film Writer Veena Pani : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వ విజయోత్సవ సభలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’ (Swara Veenapani)ని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రవాస భారతీయులు (NRIs), సంగీత సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
‘తానా’ (TANA) కౌన్సిలర్-ఎట్-లార్జ్‘ ప్రతినిధి లోకేష్ నాయుడు సభ్యులందరికి స్వాగతం పలికారు. ‘స్వరనిధి స్వర వీణాపాణి’కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంగీత గురువులు సమీరా శ్రీపాద ‘విఘ్నేశ్వర స్తుతి’ ప్రార్ధనా గీతంతో ఈ సన్మాన సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘తానా’ కళాశాల చైర్మన్ రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ.. ‘కళాశాల ప్రారంభం నుంచి ఎంతోమంది నృత్య కళాకారులకు, కూచిపూడి నృత్యంలో పట్టభద్రులు అవ్వడానికి సహకారం అందించాం.
రాబోయే రోజుల్లో ఆసక్తి గల విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందిస్తాం’ అని ఆయన అన్నారు. తానా తెలుగు భాషా (Telugu Language) పరివ్యాప్తి కమిటి చైర్మన్ చినసత్యం వీర్నపు స్వరవీణాపాణితో అనుబందాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 2018లో ‘సప్తస్వర అష్టావధానం’ నిర్వహించడానికి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. అనంతరం డా. ప్రసాద్ తోటకూరను సాదరంగా వేదిక మీదికి ఆహ్వానించారు.
Read Also : Donald Trump: డొనాల్డ్ ట్రంపును అరెస్ట్ చేశారా? సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు
అత్యంత సన్నిహిత మిత్రుడైన స్వరవీణాపాణిని కరతాళ ధ్వనులమధ్య వేదికపైకి డాక్టర్ తోటకూర ఆహ్వానించారు. వీణాపాణి గిన్నీస్ రికార్డు అందుకోవడం, తెలుగు జాతికి గర్వకారణమన్నారు. సంగీత ప్రపంచం మొత్తం 72 మేళకర్త రాగాలలోనే నిబిడీకృతమై ఉంటుందని ఆయన గుర్తు చేశారు. స్వర వీణాపాణి మాట్లాడుతూ.. డా. ప్రసాద్ తోటకూరతో అనుబంధం జీవితంలో మరువలేనిదని అన్నారు. వెన్నం ఫౌండేషన్ అధినేత మురళీ వెన్నం, డా. ప్రసాద్ తోటకూర ఇచ్చిన ప్రోత్సాహం, ఆదరాభిమానాలతోనే ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డును అందుకున్నానని అన్నారు.
అనంతరం ‘లండన్లో గిన్నిస్ రికార్డ్ల పర్యవేక్షణ అధికారిక బృందం ఆలపించిన ‘స్వర గాంధీజీ -72 మేళకర్తాల’ రాగాలను స్వర కామాక్షి, స్వర బీజాక్షి కీర్తనలను ఆలపించారు. తన సంగీత ప్రతిభతో అందరిని మంత్రముగ్దులను చేశారు. ఆ తరువాత డా. ప్రసాద్ తోటకూర, మురళీ వెన్నం చేతులు మీదుగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డును మరోసారి అందుకున్నారు. తానా, టాంటెక్స్ అధికార బృందం స్వరవీణాపాణిని శాలువ, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. సభలో గురువర్యులు డా. జయకృష్ణ బాపూజీ జంధ్యాలకు వీణాపాణి పాదాభివందనం చేసి దీవెనలు అందుకున్నారు. బాపూజీ జంధ్యాల శిష్యులు వీణాపాణిపై చక్కటి కవితను అందరికీ వినిపించి కొనియాడారు.
కాగా, లోకేష్ నాయుడు, మురళీ వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, అశోక్ కొల్లా, చినసత్యం వీర్నపు, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డా. భానుమతి ఇవటూరి , లక్ష్మి పాలేటి, శరత్ యర్రం (టాంటెక్స్ అధ్యక్షులు), వెంకట్ ములుకుట్ల, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, వెంకట ప్రమోద్, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, లెనిన్ వేముల,సుందరరావు బీరం, బాపూజీ జంధ్యాల మొదలైన పురప్రముఖులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు, మైత్రి రెస్టారెంట్, వివిధ ప్రసార మాధ్యమాలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు మురళీ వెన్నం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
Read Also : Indian Embassy In UK: భారత్ రియాక్షన్తో లండన్లో మారిన సీన్.. భారత ఎంబసీ ముందు టైట్ సెక్యూరిటీ