Telangana BJP: పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నేడు మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కరీంనగర్ లో నిర్వహించే మౌన దీక్షలో పాల్గోనున్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో బీజేపీ దూకుడు పెంచింది. ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది.
Bandi Sanjay: టీఆర్ఎస్ సర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ దరఖాస్తులు
ఆదివారం బీజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో తెలంగాణ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్య, పోలీసుల దాడులపై చర్చించారు. ఈ సందర్భంగా పోడు భూములు, ధరణి పోర్టల్ వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. దీంతో సోమవారం బండి సంజయ్ కరీంనగర్లో సుమారు రెండు గంటలపాటు మౌన దీక్ష చేపట్టనున్నారు.
ఇదిలాఉంటే తెలంగాణలో బీజేపీ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు బండి సంజయ్ మూడవ విడత ప్రజాసంగ్రామ యాత్ర ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 20 రోజులు జరిగే ఈ యాత్ర వివరాలను త్వరలోనే వివరిస్తామని బీజేపీ నేతలు తెలిపారు. అంతేకాక ఈనెల 21 నుంచి పల్లె గోస – బీజేపీ భరోసా తొలివిడత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నాలుగు విడతల్లో కొనసాగే ఈ కార్యక్రమంలో తొలి విడత 30 నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు బీజేపీ నేతలు నిర్ణయించారు.