IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ చివరి అంకానికి చేరుకుంటోంది. ప్లే ఆఫ్స్ లో చోటు దక్కించుకునేందుకు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే.. రెండు జట్లు మాత్రం లీగ్ దశ నుంచే ఇంటి బాట పట్టాయి. నిన్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో లీగ్ దశ నుంచే టోర్నీ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలవగా తాజాగా పంజాబ్ కింగ్స్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోవడంతో పంజాబ్ కింగ్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది.
ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన పంజాబ్ 4 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. 8 మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్రేట్ -0.423గా ఉంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. లీగ్ దశలో మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచుల్లో గెలిచినా పెద్దగా ఉపయోగం లేదు. అయితే.. ఈ మ్యాచుల్లో పంజాబ్ గెలిస్తే మిగిలిన జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీయవచ్చు.
ఇదిలా ఉంటే.. గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. మొదట బెంగళూరు బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లి (92; 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకోగా, రజత్ పాటిదార్ (55; 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) లు దూకుడుగా ఆడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. దీంతో 60 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో రిలీ రూసొ(61; 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. స్వప్నిల్ సింగ్, లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Mumbai Indians : ముంబై ఇండియన్స్ ముక్కలైందా? హార్దిక్, తిలక్ వర్మల మధ్య తీవ్ర వాగాద్వం?