Salam Aarti Name Change : కర్ణాటకలోని ఆలయాల్లో ఇక నుంచి సలాం ఆరతి ఉండదు. 300 ఏళ్ల క్రితం నాటి టిప్పు సుల్తాన్ పాలన ఆదేశాలను ప్రస్తుత ప్రభుత్వం మార్చివేసింది. ఈ మేరకు సలాం ఆరతి పేరును సంధ్యా ఆరతిగా మారుస్తూ ప్రకటన జారీ చేసింది. హిందూత్వ సంస్థల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టిప్పు సుల్తాన్ పేరిట సలాం ఆరతితో కూడిన ఆచారాలను రద్దు చేయాలని పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో హిందూ దేవాలయాలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర అథారిటీ ముజ్రాయ్ ఆరు నెలల క్రితం ప్రతిపాదన ఆమోదం తెలిపింది.
మెల్కోట్ లోని చారిత్రాత్మక చలువ నారాయణ స్వామి ఆలయంలో టిప్పు సుల్తాన్ కాలం నుంచి అనునిత్యం సాయంత్రం 7గంటలకు సలాం ఆరతి నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆరతి పేరు మార్చాలని కర్ణాటక ధార్మిక పరిషత్ డిమాండ్ చేస్తూ వచ్చింది. కుక్కి సుబ్రహ్మణ్య ఆలయం, పుత్తూరులోని శ్రీ మహలింగేశ్వర ఆలయం, కొల్లూరులోని మూకాంబిక ఆలయంతో పాటు మరికొన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో కూడా సలాం ఆరతి జరుపుతున్నారు. మండ్య జిల్లా యంత్రాంగం ఈ ప్రతిపాదనను హిందూ మత సంస్థలు, ధర్మాదాయ శాఖ(ముజ్రాయ్)కు అందజేసింది.
Mantralayam : తుంగభద్ర తీరాన..మంత్రాలయ రాఘవేంద్రుడు
ప్రస్తుతం మెల్కోట్ లోని చలువ నారాయణస్వామి ఆలయంలోనే ఆరతి పేరు మార్పు జరిగినట్లుగా తెలుస్తోంది. సీఎం బసవరాజ్ బొమ్మాయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, అవి రాగానే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అమలు చేస్తామని ముజ్రాయ్ మంత్రి శశికళ జోలె పేర్కొన్నారు. ఈ ఆరతిని మార్చి ప్రదోష పూజ అని పిలువాలని కొల్లూరు ఆలయ అధికారును గతంలోనే విశ్వహిందూ పరిషత్ కోరడం గమనార్హం.