Dharani Portal Cancellation : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారు.. బండి సంజయ్ ధరణి పోర్టల్ రద్దు చేయబోమన్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి పేర్కొన్నారు. జేపీ నడ్డా ఆదివారం నాగర్ కర్నూల్ లో మాట్లాడుతూ ధరణి పోర్టల్ రద్దు చేస్తామన్నారని తెలిపారు. ఇదివరకు బండి సంజయ్ ధరణి రద్దు చేయను, మార్పులు చేస్తానన్నారు అని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుళ్ల మధ్య విబేధాలు ఉన్నాయా? ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం? అని ప్రశ్నించారు.
లేదంటే ఉద్దేశపూర్వకంగా ఇద్దరూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని అనుకుంటున్నారా? అని అన్నారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి అంటూ కేసీఆర్ ను జైలుకు పంపిస్తానని జేపీ నడ్డా అన్నారు అని తెలిపారు. అయితే, నిజంగానే కేసీఆర్ ను జైలుకు పంపిస్తారా లేక ఆ పార్టీతో రాజకీయ వైరం ఉందని అనుకోడానికి ఇలా అన్నారా? అని పేర్కొన్నారు. ఇదివరకు కూడా జైలుకు పంపిస్తామని బండి సంజయ్ చాలా సార్లు అన్నారు.. కానీ మాటలు తప్ప చేతలు లేవని విమర్శించారు.
మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందని, అరెస్టు చేస్తారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారని.. కానీ అరెస్ట్ జరగలేదన్నారు. నిజంగా జరిగేది చెప్పాలని.. డూప్ ఫైట్ చేసి జనాన్ని నమ్మించలేరని పేర్కొన్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా మరి కొంతమంది నేతలు ప్రజాభిప్రాయం సేకరించి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
వారిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన వెంటనే తాము చేర్చుకోలేదని.. అయిదారు నెలల కాలంలో ప్రజాభిప్రాయం తెలుసుకుని చేర్చుకుంటున్నామని చెప్పారు. తమ పార్టీలో విభేదాలు ఎప్పుడూ లేవని, కాకపోతే భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. వివిధ రకాల అభిప్రాయాలు ఉండడమే అసలైన ప్రజాస్వామ్యం అని అన్నారు. కొందరు నేతల చేరికపై స్థానికంగా కొందరికి భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అలాంటివారికి సర్దిచెప్పుకుంటూ ముందుకెళ్తామని తెలిపారు.