Kiran Kumar Reddy
Kiran Kumar Reddy – BJP: రాష్ట్ర విభజన త్వరగా తెలంగాణ(Telangana)లో మెదటసారి బహిరంగ సభలో మాట్లాడారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన సభలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. అందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లతో పాటు రాష్ట్రంలోని దుబ్బాక, హుజూరాబాద్ లో వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని అన్నారు.
కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత పార్టీ మారతారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ని గద్దె దింపి బీజేపీ అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావటానికి తాను కూడా కృషి చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.