KTR
KTR Commemts Modi : నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 1950 నుంచి 2014 వరకు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దశాబ్ధాల పోరాటం తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో సవాళ్లు, సందేహాలు ఉండేవని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారని తెలిపారు. కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయని తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ ప్రతి ఇంటికి తాగునీరు అందించారని గుర్తు చేశారు.
Govt Employees PRC : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో రెండో పీఆర్సీ
అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయని పేర్కొన్నారు. కావున కరెంట్ ఎక్కువ అవసరం పడుతుందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్ను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయిందని తెలిపారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని వెల్లడించారు.
వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మిషన్ భగీరథ లాంటి పథకాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం కాపీ కొడుతున్నాయని పేర్కొన్నారు. మోదీ సర్కార్ తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదని విమర్శించారు. విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎన్నో అంశాల్లో మద్దతు ఇచ్చామని తెలిపారు.
నీతి ఆయోగ్ చెప్పినా మోదీ సర్కార్ తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రానికి మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గర్వంగా చెప్పారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని చెప్పారు.
ఐటీ సెక్టార్ పురోగతితో యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందన్నారు. ఐటీ ఉద్యోగులు 30 ఏళ్లలోపే ఇళ్లను కొనేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఐటీ ఉద్యోగులు 9 లక్షల మందికి చేరుకున్నారని పేర్కొన్నారు. ఐటీ సెక్టార్లో ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని తెలిపారు.