Arable Land
Arable Land : పంటల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం, భూముల్లో సేంద్రీయ పదార్థం తగ్గిపోవటం వల్ల భూభౌతిక లక్షణాలు దెబ్బతిని నేలలు చౌడుబారిపోతున్నాయి. దీనివల్ల సాగుభూములు నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా చౌడుభూములను సాగుకు అనుకూలంగా మార్చుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధన సంచాలకులు.
రైతులు తెలిసోతెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగటమే కాకుండా, పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దీనికితోడు మనం అందించే నీటిలో వుండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. సాధారణంగా భూమిలో వుండే కొన్నిరకాల లవణాల వల్ల భూమి పైభాగంలో తెల్లని లేదా బూడిదరంగులో పొరలు ఏర్పడుతూవుంటాయి. వీటినే చౌడుభూములు అంటారు. వీటిలో ప్రధానంగా తెల్లచౌడు, కారుచౌడు ఎక్కువగా కనబడుతుంటాయి.
READ ALSO : Diabetes and headaches : తలనొప్పి అనేది రక్తంలో చక్కెర ఎక్కువ లేదా తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణమా?
ఏటా సేంద్రీయ ఎరువులు వాడే ప్రాంతాల్లో ఈ సమస్య వుండదు. భూమిపై తెల్లటిపొరలా లవణాలు పేరుకుని ఉండటాన్ని పాలచౌడు అంటారు. కారు చౌడు భూముల్లో నలుపు లేదా బూడిదరంగులో వుండే పొరలను గమనించవచ్చు. భూపరీక్షల ఆధారంగా పంటలను ఎంచుకోవాలి. మరోవైపు సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. ముఖ్యంగా సేంద్రీయ ఎరువులను, పచ్చిరొట్టెఎరువులను.. సమగ్రఎరువుల యాజమాన్యంలో భాగం చేయటం వల్ల చౌడుభూముల తీవ్రతను తగ్గించుకోవచ్చు.
ఏటా భూపరీక్షలు చేయించి, తదనుగుణంగా పంటలను ఎన్నుకోవటం, సేంద్రీయ ఎరువులను, రసాయన ఎరువులను సిఫారసు మేరకు అందించటం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చంటూ వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధన సంచాలకులు ఉమ్మారెడ్డి వివరాలు తెలియజేస్తున్నారు.