Vegetable Pulp Management : ఏ పంట దిగుబడి అయినా.. ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే నారుమడి దశలోనే రైతులు శ్రద్ధ వహించాలి. ఇప్పుడు నూటికి 90 శాతంమంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంత మంది ప్రోట్రేలలో నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అందిరావడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో సూచిస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, మిటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచ ఆహార సంస్థ నిర్ధేశించిన విధంగా ప్రతి మనిషికి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మనదేశంలో కేవలం 230 గ్రా. మాత్రమే లభ్యమవుతున్నాయి. కావున కూరగాయల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది.
సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగుచేస్తారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్ లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ సీజన్ లో సాగు విస్తీర్ణం అధికంగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం కూడా పెరుగుతుంది.
కాబట్టి ఖరీఫ్ కూరగాయల సాగుచేసే రైతులు.. మొదట నారుపెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి. అయితే ఈ రకాల విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది కాబట్టి.. ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. ప్రతి విత్తనం మొలవాలంటే నారుమడి పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం ఏంటో తెలియజేస్తున్నారు , మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి.
నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో.. శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల విత్తనం , నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంద్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తనశుద్ధి తప్పక చేయాల్సి ఉంటుంది .
సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది. నారు మొక్కల్లో వేరువ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధానపొలంలో నాటినపుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం వుంటుంది కనుకు దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి.
Read Also : Manjeera Wildlife : జీవ వైవిద్య ప్రాంతంగా మంజీరా