Rashmika Mandanna : ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నా డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda). త్వరలో డీజే టిల్లు సీక్వెల్ తో రాబోతున్నాడు కూడా. ఆ తర్వాత సిద్ధు చేతిలో మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నట్టు సమాచారం. అయితే సిద్ధు జొన్నలగడ్డ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా ఒక సినిమా మొదలవ్వబోతుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.
రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ఒకటి మొదలుపెట్టింది. అలాంటిది ఈ సమయంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన రష్మిక హీరోయిన్ అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా రష్మిక ఫ్యాన్స్.. స్టార్ హీరోయిన్ హోదాలో ఉండి మీడియం హీరోతో సినిమా ఎందుకు, అది కూడా సిద్ధు పక్కన అని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ కలిపింది ఏ స్టార్ డైరెక్టరో కాదు. ఒక డెబ్యూ డైరెక్టర్ కావడం విశేషం. టాలీవుడ్ ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతుంది. టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ (Kona Venkat) కుటుంబం నుంచి ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన (Neeraja Kona) ఇండస్ట్రీకి పరిచయమైంది. బాద్షా సినిమాలో ఎన్టీఆర్ (NTR) అండ్ కాజల్ అగర్వాల్ కి మొదటిసారి కాస్ట్యూమ్ డిజైనర్ పని చేసి కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లోని చాలా పెద్ద సినిమాలకు, స్టార్ హీరో, హీరోయిన్స్ కి నీరజ కోన కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది.
ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్ గా స్టార్ హోదాలో ఉండి బాగానే సంపాదిస్తూ బిజీగా ఉంది. రచయితగా మారి ఓ పుస్తకం కూడా రాసింది. ఇప్పుడు దర్శకురాలిగా మారబోతుంది. తాను డైరెక్టర్ గా మారబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. యువ రచయిత మిథున్ చైతన్య రాసిన కథతో నీరజ కోన ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన రష్మికని తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ సినిమా ఈ జంటతోనేనా కాదా అంటే వెయిట్ చేయాల్సిందే.