UP Election వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పలు వరాలు గుప్పిస్తోంది.
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ…తాజాగా విద్యార్ధినులు, యువతులకు పలు వరాలు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంటర్ పాసైన బాలికలకు స్మార్ట్ఫోన్లు, డిగ్రీ చదివిన యువతులందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందించనున్నట్లు ప్రియాంకా గాంధీ గురువారం ప్రకటించారు. మేనిఫెస్టో కమిటీ ఆమోదంతో కాంగ్రెస్ యూపీ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ట్వీట్ లో ఆమె తెలిపారు.
ఈ మేరకు కొందరు విద్యార్థినులతో ఓ వార్తా ఛానెల్ రిపోర్టర్ మాట్లాడుతున్న వీడియోను ట్వీట్కు జత చేశారు ప్రియాంక గాంధీ. యూపీ పర్యటనలో భాగంగా ప్రియాంకతో వీరంతా సెల్ఫీ దిగారు. ఈ సమయంలోనే తమకు ఫోన్లు లేవని ప్రియాంకతో చెప్పారు. స్మార్ట్ఫోన్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని ప్రియాంక తమకు హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు.
ALSO READ 900 years old sword : సముద్రంలో స్కూబా డైవర్ కు దొరికిన 900 ఏళ్లనాటి ఖడ్గం