Tamil Nadu: పెరుగు ప్యాకెట్లపై “దహీ” అని హిందీలో రాయాలంటూ ఆదేశాలు జారీ చేసిన ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI)కు తమిళనాడు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. పెరుగు ప్యాకెట్లపై “దహీ” అని మాత్రమే రాయాలని, “కర్డ్” జెనెరిక్ పదం అని, “దహీ” మాత్రమే నిర్దిష్ట పదమని తాజాగా FSSAI తెలిపింది.
అయితే, హిందీ మాట్లాడని రాష్ట్రాల ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దాలనుకుంటున్నారని ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న పలువురు ప్రముఖులు FSSAI ఆదేశాలపై మండిపడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పాల ఉత్పత్తిదారులు FSSAI ఆదేశాలపై స్పందించారు.
“నిర్మొహమాటంగా ప్రజలపై హిందీని రుద్దుతూ ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ తీరు మరింత పెరిగిపోయి పెరుగు ప్యాకెట్లపై కూడా హిందీలో లేబుళ్లు ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సొంత రాష్ట్రాల్లో తమిళం, కన్నడలను బహిష్కరించేలా వారి తీరు ఉంది. మా మాతృ భాషలపై ఇంతలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారు దక్షిణాది నుంచి పూర్తిగా కనుమరుగు అవుతారు” అని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
FSSAI ఆదేశాలపై పాల ఉత్పత్తిదారుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో FSSAI వెనక్కితగ్గి, ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటూ మరో ప్రకటన చేసింది. ఇంగ్లిష్ పదం కర్డ్, తెలుగు పదం పెరుగుతో పాటు తమిళం, కన్నడ వంటి ఇతర భాషల్లోనూ లేబుళ్లు వాడవచ్చని పేర్కొంది.
The Elephant Whisperers : ప్రధాని మోదీకి ఆస్కార్ అందించిన విజేతలు..