ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
విమానం ఇంజన్ లో మంటలు వ్యాపించిన సమయంలో లోపల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అందరూ తమ సీట్ల నుంచి లేచి ఏం జరుగుతుందో ఏమోనని కంగారుపడ్డారు.
- Harishth Thanniru
- Published On : May 19, 2024 / 12:32 PM IST
Air India Express flight
Air India Express Flight : బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. విమానం ఇంజన్ లో మంటలు రావడంతో బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో విమానంలో179 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగక పోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Also Read : తిరుమల, బాసర పుణ్యక్షేత్రాల్లో పెరిగిన భక్తుల రద్దీ ..
ఎయిర్ ఇండియాకు చెందిన విమానం బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తుంది. బెంగళూరులో టేకాఫ్ అయిన సమయంలోనే విమానం ఇంజిన్ లో మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి పైలట్ కు సమాచారం అందించారు. పైలట్ వెంటనే సమయస్ఫూర్తితో కమాండ్ కంట్రోల్ రూంకు విషయాన్ని తెలియజేశాడు.. వెంటనే బెంగళూరు ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానాన్ని సురక్షితంగా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతికలోపం కారణంగానే ఇంజన్ లో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.
Also Read : అదుపులేని ఎన్నికల వ్యయం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అంత ఖర్చా!
విమానం ఇంజన్ లో మంటలు వ్యాపించిన సమయంలో లోపల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అందరూ తమ సీట్ల నుంచి లేచి ఏం జరుగుతుందో ఏమోనని కంగారుపడ్డారు. ఈ క్రమంలో విమానం సిబ్బంది.. విమానం ల్యాండ్ అవుతుంది, మీ సీట్లలో మీరు కూర్చోవాలని కోరుతుండటం వైరల్ అయిన వీడియోలో వినింపించింది. సురక్షితంగా విమానం ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కొంచెం ఆలస్యమైనా పెనుప్రమాదం సంభవించి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.
