Kushboo Sundar తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ధౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ సినీ నటి కుష్బూ.. తనను గెలిపిస్తే ప్రతి ఆడపిల్ల బ్యాంకు ఖాతాలో రూ.లక్ష వేస్తానని హామీ ఇచ్చారు.
శనివారం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి తన నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఖుష్బూ సుందర్..మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని అన్నారు. తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే.. వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయలు బ్యాంక్లో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ చిన్నారి స్వతంత్రంగా ఎదగడానికి ఈ డబ్బు సాయపడుతుందని ఖుష్భూ అన్నారు. పురిటిలోనే ఆడ పిల్లను చంపే ధోరణిని ఆపాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం ఖుష్భూ ఓ టిఫిన్ సెంటర్ దగ్గర దోశలు వేశారు.
కాగా, 234స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఒకే దశలో ఏప్రిల్ 6న పోలింగ్ జరుగనుంది. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.