thieves rob train engine : రైలు ఇంజన్లు, ఇనుప వంతెనలు ఎత్తుకుపోతూ దొంగలు కొత్త పోకడలు పోతున్నారు. బీహార్లో దొంగలు బరితెగించారు. ఏకంగా రైలు ఇంజన్ నే ఎత్తుకెళ్లారు. ఇటీవల ముజఫర్పూర్లోని ఓ ఇనుప తుక్కు గోడౌన్పై పోలీసులు దాడి చేసినప్పుడు 13 బస్తాల రైలు ఇంజన్ విడిభాగాలు పట్టుబడ్డాయి. దొంగలు దేన్నీ వదిలిపెట్టడం లేదు. చివరకు పాతకాలం నాటి వారసత్వ సంపదలో భాగమైన ఇంజన్లనూ ఎత్తుకుపోయి ముక్కలు ముక్కులుగా చేసి అమ్ముకుంటున్నారు.
బరౌనీలోని గడారా యార్డుకు రిపేర్ల నిమిత్తం తరలించిన రైలు డీజిల్ ఇంజిన్ భాగాలను దొంగలు ఎత్తుకొని పోయారు. అందుకు వారు ఓ సొరంగం తవ్వడం గమనార్హం. ఆ సొరంగం గుండా యార్డులోకి ప్రవేశించిన దొంగలు ఇంజన్లను విప్పి విడిభాగాలను బస్తాల్లో వేసుకుని తీసుకుపోయారు.
అయితే దొంగలే కాకుండా, అధికారులు కూడా చేతివాటం చూపిస్తుండటం విశేషం. గత ఏడాది సమస్తిపూర్ లోకో డివిజన్కు చెందిన ఓ రైల్వే ఇంజినీర్ పూర్ణియా కోర్టు ఆవరణలో ఉంచిన పాత ఆవిరి ఇంజన్ను అమ్ముకోవడం సంచలనంగా మారింది.