Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వృద్ధులు, చిన్న పిల్లలు.. వారి తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది. వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీతో పాటు పండుగతో కూడిన వరుస సెలవులు ఆగస్టు 19 వరకు కొనసాగనున్నాయి.
పెరటాసి నెల సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 17వరకు ఉంటుంది. ఈ రోజుల్లో తిరుమల యాత్రికుల రద్ధీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను వారి నిర్దేశిత సమయాలలో మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. యాత్రికులు దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు కంపార్ట్మెంట్లలో మరియు క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి సిధ్ధపడి , ఓపికతో రావాలని టీటీడీ కోరింది.
ఆగస్టు 11 నుండి 15 వ తేదీ వరకు వరుస సెలవుల ఉన్న నేపధ్యలో కూడా తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమలకు రావాలని టీటీడీ అధికారులు కోరారు.