Eatala Rajender (Photo : Twitter)
Eatala Rajender – Security : తెలంగాణ బీజేపీ కీలక నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు కేంద్రం భద్రత కల్పించనుంది. ఆయనకు వై-కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వనుంది. తన భర్తకు ప్రాణహాని ఉందని, తన భర్త హత్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర పన్నినట్లు ఈటల రాజేందర్ భార్య ఈటల జమున సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె అలా ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే ఈటల భద్రత విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
15 రోజుల క్రితమే ఈటల సెక్యూరిటీకి సంబంధించి కేంద్రానికి ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నివేదిక ఇచ్చింది. ఇటీవల తనను కలిసిన సమయంలో ఈటలకు సెక్యూరిటీ థ్రెట్ను వివరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈటలకు వై కేటగిరీ భద్రత కల్పిస్తామని అమిత్ షా చెప్పారట. దీంతో భద్రతకు సంబంధించి రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య ఈటల జమున సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రూ.20 కోట్లు ఇచ్చైనా ఈటల రాజేందర్ ను హత్య చేయిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నట్లు ఈటల జమున ఆరోపించడం రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈటలకు భద్రత పెంపునకు ప్రాధాన్యత ఏర్పడింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఈటల జమున తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ అండతోనే కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నారని, కౌశిక్ ను జనం పైకి పిచ్చికుక్కలా వదిలేశారని ఆమె ధ్వజమెత్తారు.
తనపై ఈటల జమున చేసిన ఆరోపణలను కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హత్యా రాజకీయాలు చేసే అలవాటు ఈటల రాజేందర్ కు ఉందన్నారు. ఉద్యమకారులను ఎంతో టార్చర్ పెట్టారని చెప్పారు. 2001లో ఎంపీటీసీ బాల్ రెడ్డిని ఈటల హత్య చేయించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. నేను ఆయనను చంపడం కాదు.. ఆయనే నన్ను చంపిస్తారనే భయం ఉందన్నారు.
తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చంపేందుకు కుట్ర చేసినట్లు కౌశిక్ రెడ్డి ఆరోపించారు. 2018లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న సమయంలో నన్ను చంపించేందుకు ప్రయత్నాలు చేశావా? లేదా? అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.