Komatireddy Rajagopal Reddy
Telangana Congress : అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగలనుందా? అంటే అవుననే సమాదానం వినిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నఆయన.. మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ తో మంతనాలు జరిపిన రాజగోపాల్ రెడ్డికి ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది.
ఇటీవల బీజేపీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. అయినా, ఆయన ఆ పార్టీలో ఇమడలేక పోతున్నాడని తెలుస్తోంది. దీనికితోడు ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తుండటంతో తిరిగి సొంతగూటికి చేరాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోచేరి మునుగోడు నియోజకవర్గం నుంచి బరిలో దిగే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉండగా.. అందుకు కాంగ్రెస్ అధిష్టానం సమ్మతి తెలిపినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఢిల్లీ వెళ్లి రాహుల్ సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నట్లు సమాచారం. అయితే. కొందరు రాజగోపాల్ రెడ్డి అనుచరులు, బీజేపీ వర్గాలు రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు విషయాన్ని ఫేక్ ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు.
బీజేపీ అధిష్టానం ఆదివారం తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 52 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతలతో పాటు రాజగోపాల్ రెడ్డి పేరుకూడా లేదు. అయితే, రాజగోపాల్ రెడ్డి మునుగొడు లేదా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని అదిష్టానం దృష్టికిసైతం తీసుకెళ్లినట్లు తెలిసింది. త్వరలో విడుదలయ్యే రెండో జాబితాలో రాజగోపాల్ రెడ్డిపేరును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తుండటం బీజేపీ శ్రేణుల్లో ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. 2009లో భువనగిరి ఎంపీగా విజయం సాధించి రాజకీయ అరంగ్రేటం చేశారు. 2014లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.. ఆ తరువాత నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసి విజయం సాధించారు.. ఆ పదవీకాలం పూర్తికాకముందే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే, ఆ తరువాత కొద్దికాలానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక రావడంతో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.