CM KCR : సీఎం కేసీఆర్ ఫామ్‌‌హౌస్‌లో రాజశ్యామల, శత చండీ యాగం .. ఎన్నికల్లో మరో విజయం కోసమేనా..?

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఎం కేసీఆర్ మరోసారి రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు.

CM KCR Rajshyamala yagam

Rajshyamala yagam CM KCR  : మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మరోసారి యాగం నిర్వహిస్తున్నారు. బహుశా మూడో సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలనే సంకల్పంతో రాజశ్యామల, శత చండీ యాగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సిద్ధిపేటలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు సీఎం కేసీఆర్ యాగం నిర్వహించనున్నారు.  బుధవారం తెల్లవారు జాము 3గంటలకు యాగం ప్రారంభమైంది. ఈ యాగంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగాపాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ తరచు యాగాలు నిర్వహిస్తుంటారనే విషయం తెలిసిందే. కీలక కార్యక్రమాల సందర్భంగా యాగాలు చేయిస్తుంటారు.  సతీ సమేతంగా పాల్గొని నియమనిష్టలతో పూజలు చేస్తుంటారు. దీంట్లో భాగంగా తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో మరోసారి రాజశ్యామల, శత చండీ యాగం నిర్వహిస్తున్నారు. విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో పలువురు పండితులతో ఐదు రోజుల పాటు రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. యాగ నిర్వహణకు కర్ణాటక,ఆంద్రప్రదేశ్ నుండి దాదాపు 200 మందికి పైగా పురోహితులు హాజరయ్యారు.

అధికారం సిద్ధించటానికి… శత్రువుల బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం కూడా ఈ యాగం చేస్తారని పండితులు చెబుతుంటారు.ఈ యాగంలో భాగంగా మొదటి రోజున అంటే ఈరోజు సీఎం కేసీఆర్ దంపతులు గోపూజ చేసి యాగ ప్రవేశం చేశారు. ఆ తరువాత శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం యాగం ఐదు రోజుల పాటు కొనసాగనుంది.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధన తరువాత అధికారంలోకి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. దీని కోసం రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం.

 

ట్రెండింగ్ వార్తలు