Revanth Reddy
Medigadda barrage: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ప్రమాదానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు.
నాణ్యతాలోపం వల్ల ప్రమాదం జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేసీఆర్, కాంట్రాక్టర్లు కలిసి దోచుకున్నారని అన్నారు. బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణ జరపాలని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఎన్నికల కమిషన్ మేడిగడ్డపై విచారణకు ఆదేశించాలని అన్నారు.
తాము త్వరలోనే మేడిగడ్డకు వెళ్లి అక్కడి పరిస్థితి పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్ నేతలతో కలిసి మేడిగడ్డకు రావాలని డిమాండ్ చేశారు.
ప్రమాదానికి, తమకు సంబంధం లేదని ప్రభుత్వం అనడం సరికాదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ ప్రమాదం వెనుక సంఘ విద్రోహక శక్తులు ఉన్నాయా? లేదంటే మానవ తప్పిదమే కారణమా? అన్న విషయంపై విచారణ జరగాలని అన్నారు. కాలేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని నిలదీశారు.