ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. పదేళ్లలో దేశానికి మోదీ చేసింది ఏమీ లేదని, అయోధ్య రామాలయాన్ని మాత్రమే కట్టారని వీహెచ్ అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ… దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒకరు ప్రధాని అవుతారని మోదీ అంటున్నారని చెప్పారు.
అసలు ఇండియా కూటమికి కనీసం 100 సీట్లు రాటవన్న మోదీ మరి ఏడాదికి ఒక ప్రధాని అవుతారని ఎలా అంటున్నారని వీహెచ్ నిలదీశారు. మోదీలో భయం పట్టుకుందని చెప్పారు. దేశంలో కులగణన చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ దిగజారి మాట్లాడుతోందని విమర్శించారు.
రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని తీసేస్తామని బీజేపీ అంటోందని చెప్పారు. కాంగ్రెస్కి ఓటు వేస్తే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని తెలిపారు. దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, అప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మోదీ ఆలోచన అంతా కార్పొరేట్ స్థాయేనని చెప్పారు.