’37ఏళ్ల క్రితం కపిల్ చెప్పిన మాటలే జట్టును గెలిపించాయి’
1983 లో అంటే 37 సంవత్సరాల క్రితం విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా ఏ సూత్రం పాటించింది. అంతటి అవరోధనలు ధాటి ఫైనల్ లో విజయకేతనం ఎగరేయడానికి ఏ స్టేటజీ ఫాలో అయింది. అంచనాలను పటాపంచలు చేస్తూ.. ఏ మాత్రం ఆశలు నిలుపుకోని భారత జట్టు కపిల్ దేవ్ నాయకత్వంలో దూసుకుపోయింది. లార్డ్స్ మైదానం సాక్షిగా గెలిచిన వరల్డ్ కప్ చరిత్ర సృష్టించింది. అప్పటికే రెండు సార్లు విశ్వవిజేత అయిన వెస్టిండీస్ ను మట్టి కరిపించి విజయాన్ని చేరుకుంది.
మ్యాచ్ ఆసాంతం జరిగిన తీరు ఇలా ఉంది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్ భారత బ్యాట్స్మెన్ను గడగడలాడించడంతో కపిల్ సేనలో కంగారు మొదలైంది. ఆండీ రాబర్ట్స్(3), జోయెల్ గార్నర్(4), మైఖేల్ హోల్డింగ్(2) రెచ్చిపోతున్నారు. ఆదిలోనే సునీల్ గావస్కర్(2) విఫలమై కృష్ణమాచారి శ్రీకాంత్(38), మోహింతదర్ అమర్నాథ్(26), సందీప్ పాటిల్(27) ఓ మోస్తారు బ్యాటింగ్ చేశారు.
మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ కపిల్దేవ్(15) కూడా విఫలమవడంతో ఒత్తిడి పెరిగిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. విశ్వవిజేతగా నిలవడానికి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన కరీబియన్ జట్టు మార్గం సుగమమైందని భావించారు. కానీ, అప్పుడే మాయ వర్కౌట్ అయింది. జట్టులో స్ఫూర్తిని నింపి పోరాడితే పోయేదేముందని ఆటగాళ్లలో పట్టుదల తీసుకొచ్చాడు.
రెచ్చిపోయిన మదన్లాల్(3), మోహిందర్ అమర్నాథ్(3) విండీస్ను కోలుకోలేని దెబ్బ తీశారు. 66 పరుగులకే సగం జట్టును వెనక్కిపంపారు. ఓపెనర్లు గార్డన్ గ్రీనిడ్జ్(1), డెస్మండ్ హేన్స్(13)లతో పాటు దిగ్గజ బ్యాట్స్మన్ వివ్ రిచర్డ్స్(33) కూడా వెనుతిరిగాడు. కపిల్దేవ్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో అతను పెవిలియన్కు చేరాడు. కపిల్ పట్టిన ఆ క్యాచే టీమిండియా గెలవడానికి టర్నింగ్ పాయింట్ గా మారింది.
జెఫ్ డుజన్(25), మాల్కమ్ మార్షల్(18) పోరాడే ప్రయత్నం చేసినా భారత బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. చివరికి 140 పరుగులు మాత్రమే చేయగలిగిన కరేబియన్ వీరులు టీమిండియాను నూతన ఛాంపియన్గా నిలవడాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ మ్యాచ్లో మోహిందర్ అమర్నాథ్ 3 వికెట్లు, 26 పరుగులు చేయడంతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
మ్యాచ్లో భారత ఇన్నింగ్స్లో 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన శ్రీకాంత్.. ప్రపంచకప్ గెలిచి 37 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ‘పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ ఉన్న విండీస్కు 183 పరుగుల ఛేదన కష్టమేమీ కాదని, మాకు గెలిచే అవకాశాలు లేవని అనుకున్నాం. కానీ కపిల్ తన మాటలతో స్ఫూర్తి నింపాడు’
‘మనం మ్యాచ్ గెలుస్తామని చెప్పట్లేదు. చూడండి మనం 183 పరుగులకే ఆలౌటయ్యాం. అయినప్పటికీ పోరాడదాం. సులభంగా మ్యాచ్ను చేజార్చుకోకూడదు’ అని చెప్పాడు.
ఆ మ్యాచ్లో మాపై ఎక్కువ ఒత్తిడి కూడా లేదు. ఎందుకంటే 1975, 1979ల్లో విండీసే కప్పు సొంతం చేసుకుంది. కాబట్టి ఆ జట్టుతో తుదిపోరులో తలపడడమే గొప్ప విషయమని అనుకున్నాం. ఫైనల్ చేరినందుకు అప్పటి బోర్డు అధికారులు రూ.25 వేలు బోనస్గా కూడా ప్రకటించారు’ అని తెలిపాడు.